పేదల ఇళ్లకు మరుగుదొడ్ల కంటే తక్కువ స్థలం: నారా లోకేష్: 41 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోన్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ఓ పెద్ద బోగస్ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఈ పథకం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. తాము సేకరించిన, ఇప్పుడున్న సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ సహా వైఎస్ఆర్సీపీకి చెందిన 41 మంది జైలులో చిప్పకూడు తినడం ఖాయమని హెచ్చరించారు.
ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట వరుస ట్వీట్లను సంధించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కింద ప్రభుత్వం వారికి సెంటు స్థలాన్ని మాత్రమే ఇచ్చి, వేల కోట్లను దోచుకుందని మండిపడ్డారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ పథకం ఓ కుంభస్థలం వంటిదని అన్నారు. ఇళ్ల పట్టాల కోసం భూములను సేకరించడం, వాటిని చదును చేయడ అనే పేరుతో భారీ అవినీతికి తెర తీశారని చెప్పారు.
స్థల సేకరణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పథకం పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ కుంభకోణానికి పాల్పడ్డారని నారా లోకేష్ అన్నారు. దీని విలువ 6,500 కోట్ల రూపాయలని ఆరోపించారు. చంద్రబాబు సారథ్యంలోని తమ ప్రభుత్వ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు నీలం రంగును పూసి, వాటిని తమ పథకంగా పేరు మార్చుకున్నారని విమర్శించారు.
బులుగు రంగు వేసినంత మాత్రానా తమ పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ బ్రాండ్ చేరిగిపోయేది కాదని అన్నారు. వైఎస్ జగన్ బెంగళూరులో నిర్మించుకున్న కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువ స్థలంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. పైగా కొండలు, గుట్టలు,శ్మశానాలు, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు నివసించే పరిస్థితి లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అవినీతి, అక్రమాలను చూస్తోంటే.. రాష్ట్రంలో జగనన్న జైలు పిలుస్తోంది పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.
ఇప్పుడున్న ఆధారాలతో 41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయమని అన్నారు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాల్లో వేసిన కేసుల వల్లే ఇంటి స్థలాలను ఇవ్వలేకపోయామని చెబుతూ వచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడెలా వాటిని పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే జగన్ రెడ్డిని ఫేక్ సీఎం అని పిలుస్తుంటారని నారా లోకేష్ విమర్శించారు. తమ పార్టీపై అనవసరంగా నిందలు మోపారని ఆరోపించారు.