బుద్ధా వెంకన్న..బోండా ఉమా కారుపై దాడి చేసిందివైసీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే: టీడీపీ ఫిర్యాదు.. !
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తోన్న కారుపై గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో దాడి చేసిన వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. టీడీపీ నాయకుల కారుపై దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల పట్టణ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు తురక కిశోర్గా గుర్తించామని వెల్లడించారు.
Recommended Video
బుద్ధా వెంకన్న, బోండా ఉమాలపై వైసీపీ కార్యకర్తల దాడి: బైక్పై వెంబడించి..: టీడీపీ ఆరోపణ
బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు ప్రయాణిస్తోన్న కారుపై జిల్లాలోని మాచర్ల నుంచి దుర్గికి వెళ్లే మార్గంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన కారకుడు తురక కిశోరేనని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.
తమ నాయకులపై హత్యాయత్నానికి ప్రయత్నించారని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ దాడికి పాల్పడ్డారని, తమ పార్టీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దాడికి పాల్పడిన తురక కిశోర్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బుద్ధా వెంకన్న, బోండా ఉమా ప్రయాణిస్తోన్న కారు మాచర్ల శివార్లలో ఓ బాలుడిని ఢీ కొట్టిందనేది వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన. ఈ ఘటనలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని వారు చెబుతున్నారు. బాలుడిని ఢీ కొట్టినప్పటికీ.. ఆపకుండా వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. బాలుడిని తీవ్ర గాయాలకు గురి చేసిన బుద్ధా వెంకన్న, బోండా ఉమాలపై హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించితే.. ఎవరిది తప్పు అనేది తేలుతుందని వారు సవాల్ విసురుతున్నారు.