జే-ట్యాక్స్ కోసమే మద్య విధానం: రేట్లు పెంచడానికి ముడుపులు..కేసీఆర్ సలహాలతో పాలన: టీడీపీ ఫైర్
గుంటూరు: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన మద్య విధానంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మద్యం ధరలను ఇష్టానుసారంగా ఎలా పెంచుతారని మండిపడుతోంది. ఎవరినడిగి మద్యం రేట్లను పెంచారని, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నూతన మద్య విధానంలో అన్నీ లోపాలే ఉన్నాయని ఆరోపించింది. మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున జే-ట్యాక్స్ ను వసూలు చేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడా నేతలు కుట్ర పన్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు.
గురువారం వారు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మద్య విధానాన్ని ఎవరి కోసం తీసుకొచ్చారని ప్రశ్నించారు. మద్యం తయారీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. తయారీ కంపెనీల నుంచి జే-ట్యాక్స్ ను వసూలు చేశారని, దానికి అనుగుణంగా రేట్లను భారీగా పెంచారని విమర్శించారు. మద్యాన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను ఏర్పాటు చేసి మరీ.. ప్రోత్సహించడం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు.
Sri Kollu Ravindra addressing the press conference - Live from TDP State Office, Guntur https://t.co/kxPi2SI4do
— Telugu Desam Party (@JaiTDP) October 3, 2019
మద్యం రూపంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. గుడి, బడి అనే తేడా లేకుండా యథేచ్ఛగా మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారని, వాటిని వ్యతిరేకిస్తున్న మహిళలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మితిమీరిపోయాయని, దీనిపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జల విద్యుత్ ఉత్పత్తికి ఢోకా లేనప్పటికీ.. ఎందుకు కోతలను విధించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం వద్దని చెబుతున్నా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను పున:సమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కోతలు ఉండేవి కావని గుర్తు చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు వెనక్కి పోతున్నాయని, దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడుతుందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, సలహాలతో వైఎస్ జగన్ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.