పోలింగ్ సిబ్బందికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని బెదిరింపులు
Recommended Video
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ అభ్యర్థి పేరు అనగాని సత్యప్రసాద్. జిల్లాలోని రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుర్తింపు కార్డులు తెచ్చుకోకపోయినా..
తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కొందరు ఈ ఉదయం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆ సమయంలో వారి వద్ద ఓటరు స్లిప్పులు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. స్లిప్పులు మాత్రమే సరిపోవని, గుర్తింపు కార్డులు కూడా కావాలని అక్కడి పోలింగ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో వారు ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే కనగాలకు వెళ్లిన ఆయన అక్కడి సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగారు.
ఈ సందర్భంగా- ఆయన అక్కడి సిబ్బందిని, వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఎలాంటి గుర్తింపు కార్డు చూపించనప్పటికీ.. తమకు అభ్యంతరం లేదని పోలింగ్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు సత్యప్రసాద్ ను నచ్చజెప్పారు. ఆధార్ కార్డు గానీ ఇతర ఏ విధమైన గుర్తింపు కార్డు ఉన్నా, తాము ఓటు వేయడానికి అనుమతి ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ.. సత్యప్రసాద్ వినిపించుకోలేదు. తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఫలితంగా- కనగాలలో కొద్దిసేపు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది.