మెరుగుపడని అచ్చెన్న ఆరోగ్యం: వీల్ చైర్లోనే: ఎన్ఆర్ఐ ఆసుపత్రికి షిఫ్ట్
గుంటూరు: తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోగ్యంలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. సుమారు 40 రోజులుగా ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. కదల్లేని స్థితిలోనే కనిపించారు. కొద్దిరోజుల కిందటే కరోనా వైరస్ కూడా సోకడంతో మరింత నాణ్యమైన వైద్య చికిత్సను ఆయనకు అందించాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో ఆయనను రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన వీల్చైర్తో కనిపించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్ఆర్ఐ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు సంబంధించిందని తెలుస్తోంది. రాత్రి ఆయనను ప్రత్యేక అంబులెన్స్లో రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఈఎస్ఐలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న వందల కోట్ల రూపాయల మేర కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు అచ్చెన్నాయుడిపై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. అరెస్టు కావడానికి కొద్దిరోజుల ముందే ఆయనకు శస్త్రచికిత్స చేశారు.
ఆ గాయం తిరగబెట్టడంతో హైకోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడిని తొలుత గుంటూరు జనరల్ ఆసుపత్రి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రమేష్ ఆసుపత్రికి తరలించారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల కస్టడీలో ఉన్న సమయంలోనూ రెండుసార్లు శస్త్రచికిత్స చేయించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ నెల 13వ తేదీన ఆయనకు కరోనా వైరస్ బారిన పడ్డారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా సోకడంతో మరింత నాణ్యమైన చికిత్సను అందించాల్సి ఉందంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి.
Recommended Video
ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై సమగ్ర నివేదికను అందించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడి తరఫున న్యాయవాదులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించాలడానికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. దీనికి హైకోర్టు అంగీకరించింది. దీనితో ఆయనను రాత్రి రమేష్ ఆసుపత్రి నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రత్యేక గదిలో చికిత్స పొందుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన కేసులో ప్రస్తుతం ఆయనను ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు, ఉద్యోగులు అరెస్టు అయ్యారు.