వైసీపీ పంచాయతీలకు ప్రత్యేక విమానాలా ? ప్రత్యేక హోదా కోసం వెళ్లలేదే ? లోకేష్ సెటైర్లు...
వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరేందుకు వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో వెళ్లడంపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పంచాయతీల కోసం ఐదుగురు ఎంపీలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. మీ పార్టీ పంచాయితీలకు ప్రజాధనం వృథా చేయడమేంటి జగన్ గారూ అంటూ లోకేష్ ప్రశ్నించారు.
గతంలో సెర్బియా పోలీసుల చేతిలో చిక్కుకున్న సహ నిందితుడిని విడిపించమని ఉత్తరం రాశారని, ఇప్పుడు మీ పార్టీ సమస్య కోసం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తున్నారని లోకేష్ ఆక్షేపించారు. గతంలో సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన నిమ్మగడ్డ ప్రసాద్ కోసం వైసీపీ ఎంపీలు విదేశాంగమంత్రిని కలవడంతో పాటు జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ విషయాన్ని లోకేష్ మరోసారి గుర్తుచేశారు.
మరోవైపు గతంలో ప్రత్యేక హోదా కోసం కానీ, కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో కానీ, పోలవరం కోసం కానీ ఇలా ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్లారా అంటూ లోకేష్ సూటిగా ప్రశ్నించారు. మీ పంచాయతీల కోసం ప్రజాధనాన్ని వృథా చేయడమేంటి జగన్ రెడ్డి గారూ అంటూ లోకేష్ తన ట్వీట్ లో కడిగేశారు.