పాపం.. జగన్ ఎలా తట్టుకుంటారో ఏమో! పిచ్చి తిట్లు తిడుతూనే ముఖ్యమంత్రిపై సానుభూతి చూపిన నారా లోకేశ్
ప్రత్యర్థులకు వాతపెట్టి వెన్నపూయడం రాజకీయ నాయకులకు అలవాటైన పద్ధతే. టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్లున్నారు. అమరావతి రైతుల ఆత్మహత్యలు, టీడీపీ కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన లోకేశ్.. చివర్లో మాత్రం సీఎం జగన్ ను ఉద్దేశించి సానుభూతి డైలాగులు వదిలారు.
ఆత్మహత్యలపై అపహాస్యమా?
‘సేవ్ అమరావతి' ఉద్యమంలో భాగంగా నారా లోకేశ్ బుధవారం తుళ్లూరు, మందడం గ్రామాల్లో పర్యటించి రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల 11 మంది రైతులు బలయ్యారని, దీనికి బధపడాల్సిందిపోయి.. వైసీపీ నేతలు రైతుల ఆత్మహత్యల్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరిగానా ఆంబోతులా కొంచెం కూడా చలనం లేదని, వైసీపీది ఆంబోతుల ప్రభుత్వమని విమర్శించారు.
అశ్రిత చెవిపోగులు..
మండుటెండలో రైతుల పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధకలుగుతోందన్న లోకేశ్.. అమరావతి రైతుల పోరాటం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. రైతులు పండిచే అన్నం తింటూ.. వైసీపీ నేతలు అదే రైతుల్ని అవమానిస్తున్నారని ఫైరయ్యారు. రైతుల ఉద్యమానికి తన వంతు విరాళంగా బంగారు చెవిపోగులు అందించిన ఆశ్రితను ఆయన అభినందించారు. తోచిన విధంగా ఉద్యమానికి సాయం చేస్తున్న అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు.
తొత్తుల్లా పోలీసులు.. మూల్యం తప్పదు..
శాంతియుతంగా ఉద్యమం చేస్తోన్న రైతులు, టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. టీడీపీ అభిమాని అవినాష్ అక్రమ అరెస్టును ఖండించారు. బండబూతులు మాట్లాడుతోన్న వైసీపీ ప్రజాప్రతినిధుల్ని వదిలేసి, ఏ తప్పూ చేయని టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోన్న పోలీసులు వైసీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, చేసిన ప్రతి పనికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఎలా తట్టుకుంటారో..
జగన్ సీఎం అయినప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాల్లో ఏ ఒక్కటీ ప్రజలను మెప్పించలేకపోయిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో సీఎంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘పాపం జగన్ గారు సోషల్ మీడియాలో విమర్శలకే భయంతో గజగజా వణికిపోతున్నారు. ఇక రేపు ప్రజాగ్రహాన్ని, ప్రజాఉద్యమాల్ని ఎలా తట్టుకుంటారో ఏమో!''అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.