నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ ఆఫీసు నిర్మాణం: సుప్రీంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్
గుంటూరు: గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీ ఆఫీసు నిర్మాణం అక్రమం అని పేర్కొంటూ మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసు నిర్మాణం అక్రమం అని పిటిషన్లో పేర్కొన్న ఆళ్ల... ఈ భవనం నిర్మాణం కోసం భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అంతేకాదు ఈ భూమిని పార్టీ కార్యాలయంకు కేటాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. టీడీపీ ఆఫీసు కోసం భూమిని కేటాయిస్తూ 2017 జూన్ 22న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో నెం 228 జారీ చేసిందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లాయరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే: నెక్స్ట్ ఎవరు? ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే టార్గెట్?
టీడీపీ ఆఫీస్ నిర్మాణం కోసం నాడు చంద్రబాబు ప్రభుత్వం ఆత్మకూరులోని వాగు పోరంబోకు కు చెందిన మూడెకరాల 65 సెంట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మంగళగిరి మండలం ఆత్మకూరులో 392/1, 392/3 , 392/4, 392/8, 392/ 10 సర్వే నెంబర్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టేలా చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తానికి ఆ టీడీపీ కార్యాలయం అక్కడ అక్రమంగా నిర్మించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు.
Recommended Video
ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు వ్యతిరేకంగా జీవోలు జారీ చేశారని పిటిషన్లో తెలిపారు. ఈ మేరకు అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. గతంలో టీడీపీ కార్యాలయానికి భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేసిన హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, అయితే కూల్చాలా వద్దా అనేదానిపై మాత్రం హైకోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఎలాంటి స్పష్టమైన సూచనలు చేయకుండానే హైకోర్టు కేసును క్లోజ్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.