కరోనా ఎఫెక్ట్: ఈసారి మహానాడు ఆన్లైన్లోనే...టెక్ టర్న్ తీసుకున్న గ్రాండ్ ఈవెంట్..!
ఏటా మే నెల వస్తే చాలు అది నందమూరి నారావారి అభిమానులకు ప్రత్యేకించి టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద పండగలా ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలోనే టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఏటా చాలా గ్రాండ్గా జరిగే మహానాడుకు రెండు రాష్ట్రాల నుంచి తెలుగు దేశం అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారు. అంతేకాదు విదేశాల నుంచి కూడా టీడీపీ అభిమానులు అదే పనిగా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నాయకుల ప్రసంగాలు, పార్టీలో కొత్త ఎన్నికలు ఎంపికలు, కార్యాచరణ, అన్నీ ఓ వేడుకలా నిర్వహిస్తారు. అంతేకాదు మహానాడు కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒక పద్ధతి ప్రకారం చాలా గ్రాండ్గా ఈ వేడుకను నిర్వహిస్తారు. అయితే కరోనా పుణ్యమాని ఈ సంవత్సరం ఈ గ్రాండ్ ఈవెంట్కు బ్రేకులు పడనున్నాయి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం అదే ఉత్సాహంతో ఈ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. నేతలకు నాయకులకు అదే పిలుపునిస్తున్నారు.
కరోనావైరస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది: ఆ జంతువులపై సక్సెస్, ఈ ఏడాదిలోనే...!
ఆన్లైన్లో మహానాడు
తెలుగుదేశం పార్టీకే తలమానికంగా నిలిచే మహానాడు కార్యక్రమం ఈ సారి కాస్త బోసిపోయినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతాయి. అయితే కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ సమావేశాలకు, సభలకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో మహానాడు కార్యక్రమంకు బ్రేక్ పడింది. అయితేనేమీ అంతా దగ్గరగా లేకపోయినప్పటికీ ప్రపంచాన్నంతటినీ ఒక్క గొడుగు కిందకు తీసుకువచ్చే టెక్నాలజీ ఎటూ అందుబాటులో ఉంది కాబట్టి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని సాంకేతికతను వినియోగించి నిర్వహించాలని తలచారు. అసలే టెక్నాలజీని విరివిగా వినియోగించే నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబు మాత్రమే అని చెప్పక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీకి పెద్ద పీట వేసింది చంద్రబాబు అనేది విమర్శకులు సైతం ఒప్పుకుంటారు.
జూమ్ యాప్ ద్వారా మహానాడు కార్యక్రమం
ఇక తమ ఇంటి పండగలా భావించే మహానాడు కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చిన నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ అభిమానులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపే ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలవకూడదని భావించిన చంద్రబాబు... జూమ్ యాప్ ద్వారా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులోని తన నివాసం నుంచి ఏపీ ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న చంద్రబాబు జూమ్ వీడియో ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక పార్టీకి సంబంధించిన పలు సమావేశాలకు కూడా జూమ్ వీడియో యాప్ వేదికగా నిలుస్తోంది.
Recommended Video
మొత్తం ఆరుగంటల్లోనే ముగించేలా ప్లాన్
ఇక మహానాడు కార్యక్రమం విషయానికొస్తే ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను కూడా నిర్వహిస్తారు. ఈ సారి మాత్రం మొత్తం వేడుకను రెండు రోజుల్లో మొత్తం ఆరుగంటల సమయంలో ముగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27న మూడుగంటలు 28వ తేదీ అంటే ఎన్టీఆర్ జయంతి రోజున మూడుగంటల పాటు నిర్వహించాలని భావిస్తోంది. 27వ తేదీన ఉదయం గంటన్నర సాయంత్రం గంటన్నర ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ముఖ్యనేతల ప్రసంగాలు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ జయంతి రోజున ఆయనకు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై మొత్తం షెడ్యూల్ను విడుదల చేస్తామని టీడీపీ వెల్లడించింది. మహానాడు సుమారు 14వేల మంది పాల్గొంటారని సమాచారం. ఇతర దేశాల నుంచి కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
మొత్తానికి ఈ సారి మహానాడు మొత్తం ఆన్లైన్లోనే గ్రాండ్గా నిర్వహిస్తారని తెలియడం అది కూడా తొలిసారి కావడంతో పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు కొత్త అనుభవంను పొందేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.