టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్... భారీ పోలీస్ బలగాలతో ఇంటిని చుట్టుముట్టి...
టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధూళిపాళ్ల అరెస్ట్ కోసం దాదాపు 100 మంది పోలీసులను తెల్లవారుజామునే ఆయన ఇంటి వద్ద మోహరించినట్లు తెలుస్తోంది. అనంతరం నరేంద్రను పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు... ఎక్కడికి తీసుకెళ్లారన్న కచ్చితమైన వివరాలు తెలియరాలేదు.
ధూళిపాళ్ల అరెస్టుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ధూళిపాళ్ల సంగం డెయిరీ ఛైర్మన్గా ఉన్నారు. ఆ సంస్థలో అవినీతి అక్రమాల ఆరోపణలే అరెస్టుకు కారణమని ఏసీబీ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆయనపై సెక్షన్లు 408,409,418,420,465ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు,రాజధాని భూముల వ్యవహారంలోనే ధూళిపాళ్లను అరెస్ట్ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
సంగం డెయిరీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు గతంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని గతంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య డిమాండ్ చేశారు. సంగం డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు కచ్చితంగా హెరిటేజ్ డెయిరీకే పాలను సరఫరా చేయాలని షరతు విధించారని ఆరోపించారు.
సంగం డెయిరీలో పాల ఉత్పత్తిదారుల పిల్లల సంక్షేమం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు ధూళిపాళ్ల మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం పదెకరాల భూమి ఇచ్చింది. అయితే ఈ భూమిలో కాలేజీ ఏర్పాటు చేయకుండా సొంత ఆస్తిగా అనుభవిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే వేతనాలు,సిబ్బంది నియామకాలు,ఆర్థిక అంశాల్లో అవతకవలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై ఏసీబీ అధికారులు ధూళిపాళ్లను విచారించే అవకాశం ఉంది.