జగన్ గోపూజను తప్పు పట్టిన అచ్చెన్న: అక్కడ క్రూరమృగాలు: ఇక్కడ గోపూజలు: వివేకా హత్యతో లింక్
గుంటూరు: కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించిన గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనటాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. ఆయనకు ఆ అర్హత లేదని విమర్శించింది. తన రాజకీయాలు, ఓటు బ్యాంకు కోసం జగన్.. చివరికి గోవులను కూడా వదలట్లేదని మండిపడింది. దేవాలయాలపై జరుగుతోన్న దాడుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ ఎత్తుగడను వేశారని, ప్రజలు ఎవరూ ఆయనను నమ్మబోరని టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
Recommended Video
జగన్ గోత్ర నామం.. జన్మనక్షత్రం ఇదే: వైభవంగా గోపూజ..ప్రదక్షిణ: అన్యమతస్తుడనే విమర్శలకు చెక్
ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే..
వైఎస్ జగన్ కనుసన్నల్లోనే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కొనసాగుతున్నాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లడారు. విగ్రహాలపై దాడులు చేయిస్తూ గోవులకు పూజలు చేస్తున్నట్లు నటిస్తే ఎవరూ నమ్మరని అన్నారు. చేసిన పాపం పోదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు దేవాలయలపై ఇన్ని దాడులు చోటు చేసుకోలేదని, వైసీపీ నేతల అండదండలతోనే దుర్మార్గులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ అరెస్ట్ కాకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు.
ఇడుపుల పాయలో క్రూరమృగాలు..
ఇడుపులపాయలో వైఎస్ జగన్.. క్రూరమృగాలను పెంచుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ క్రూరమృగాలతోనే తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారని ధ్వజమెత్తారు. అక్కడ క్రూరమృగాలను పెంచుతూ.. పెంచి పోషిస్తూ.. ఇక్కడ గోపూజలకు పూజలు చేస్తే చేసిన పాపం పోతుందా? అని నిలదీశారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులూ వైఎస్ జగన్ ఏ ఒక్క మతాన్ని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
జగన్ నటన అద్భుతం..
తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను రద్దు చేయడానికి ఇవే కారణమని విమర్శించారు. వైఎస్ జగన్ తన నటనకు జీవం పోస్తున్నారని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని అచ్చెన్నామయుడు విమర్శించారు. సొంత బాబాయ్ హత్యపై జాలి చూపని వ్యక్తి దేవుళ్లపై విశ్వాసం చూపుతాడని భావించడం భ్రమే అవుతుందని చురకలు అంటించారు. మతాల మధ్య మంట పెట్టి చలికాచుకుంటున్నారని, అవే మంటలు ఆయనను చుట్టుముట్టుతాయని హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు.
ఓట్ల కోసం గోపూజలు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హిందువుల ఓటుబ్యాంకు కోసం గోపూజను నిర్వహించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఓట్ల కోసమే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపూజలతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం నుంచి మరల్చడానికి కుట్ర పన్నారని అన్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినప్పటికీ.. చేసిన తప్పులను ప్రజలు ఎప్పటికీ విస్మరించబోరని, ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.