గుంటూరులో టెన్షన్.. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ .. ఐదుగురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా రావణ కాష్టంలా రాష్ట్రాన్ని దహిస్తూనే ఉన్నాయి.
లారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్ .. ఉల్లంఘిస్తే భారీ జరిమానా ... వాళ్లకు పెద్ద కష్టమే
ఎన్నికల తర్వాత నుండీ నేటి వరకు గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ ఘర్షణలను నివారించేందుకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడ పరిస్థితుల్లో మార్పు రావటం లేదు . ఇక తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధిశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటికే పలుమార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రంధిసిరి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తమ వర్గీయుల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు చేశారని టీడీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలకు చెందిన ట్రాక్టర్, బైక్ లను దుండగులు ధ్వంసం చేశారని వారంటున్నారు .ఈ దాడుల్లో ఐదుగురికి గాయాలు అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలకు చెందిన వారిని గృహనిర్బంధం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఈ దాడుల్లో గాయపడిన వారిని సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. అధికార, విపక్ష పార్టీల వర్గాల మధ్య ఘర్షణలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇక టీడీపీ , వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని వారంటున్నారు .