కోడెల నివాసంలో చోరీ..దొరికిన కంప్యూటర్లు..హైడ్రామా: ఫర్నీచర్ స్వాధీనానికి అధికారులు..!!
మాజీ స్పీకర్ కోడెల కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వైపు అసెంబ్లీ ఫర్నీచర్ గురించి రగడ జరుగుతున్న సమయంలోనే ఈ చోరీ జరిగింది. చోరీని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వాచ్ మెన్ పైన దాడి చేసి.. కంప్యూటర్లతో పరారయ్యారు. అయితే, కార్యాలయానికి కొద్ది దూరంలోనే కంప్యూటర్లు తిరిగి దొరికాయి. ఇదే సమయంలో అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం కోసం అధికారులు కోడెల కార్యాలయానికి వెళ్లనున్నట్లుగా సమాచారం. కొద్ది రోజులుగా అసెంబ్లీ ఫర్నీచర్ మాయం.. కోడెల తన వద్దే ఉందని ప్రకటన రాజకీయంగా వేడి పుట్టించింది. ఇదే సమయంలో అధికారులు కోడెల కార్యాలయానికి వెళ్లి ఫర్నీచర్ స్వాధీనానికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. ఇప్పుడు అక్కడే చోరీ జరగటం..తిరిగి దొరకటం చర్చనీయాంశంగా మారింది.
కోడెల కార్యాలయంలో చోరీ..
కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ స్పీకర్ కోడెల కార్యాలయంలో చోరీ జరిగింది. సత్తెనపల్లిలోని ఆయన కార్యాలయంలో దొంగలు పడ్డారు. కార్యాలయంలోని కంప్యూటర్లను దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉన్న వాచ్ మెన్ పైన దాడి చేసి కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని సమాచారం. అయితే అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయలేదు. దీంతో అక్కడ జరుగుతున్న వ్యవహారాల పైన అనేక అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. అయితే, కొద్ది సేపటి క్రితం కోడెల కార్యాలయానికి సమీపంలోనే కంప్యూటర్లను గుర్తించారు. అయితే, అసలు దొంగిలించింది ఎవరు..దీనిని సమీపంలోనే ఎందుకు వదిలేసి వెళ్లారనే దాని పైన విచారణ సాగుతోంది. ఈ ఘటన మీద అనేక చర్చలు తెద మీదకు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు గతంలో కోడెల కార్యాలయంలో పని చేసిన సిబ్బందే ఈ పనికి పాల్పడినట్లుగా గుర్తించారు. వారిలో ఒకరు సత్తెనపల్లి మున్సిపాల్టీలో పని చేసే అర్జునుడుగా చెబుతున్నారు. కంప్యూటర్లను అతనే తీసుకెళ్లి..కార్యాలయం బయట గోడ వద్ద పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో..కోడెల కార్యాలయంలో జరుగుతన్న పరిణామాల మీద పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పుడు ఇది రాజకీయంగానూ రంగు పులుముకొనే అవకాశం ఉంది.
కోడెల కార్యాలయానికి అసెంబ్లీ అధికారులు..
అసెంబ్లీ ఫర్నీచర్ తన వద్ద ఉందని మాజీ స్పీకర్ కోడెల అంగీకరించటంతో..అసెంబ్లీ సిబ్బంది రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నీచర్ ను తరలించే సమయంలో తన క్యాంపు కార్యాలయం లో ఫర్నీచర్ ఉంచినట్లు కోడెల వివరించారు. దీని పైన తాను అసెంబ్లీ కార్యదర్వికి లేఖ రాసానిని..వారు వస్తే తిరిగి ఫర్నీచర్ ఇచ్చేస్తానని..లేకుంటే వాటి విలువ చెబితే చెల్లిస్తానని కోడెల స్పష్టం చేసారు. దీంతో..అసెంబ్లీ అధికారులు రికార్డుల ప్రకారం ఉండాల్సిన ఫర్నీచర్..కోడెల క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఫర్నీచర్ ను పరిశీలించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో..ఫర్నీచర్ అసెంబ్లీ రికార్డుల ప్రకారం లెక్కలతో పోల్చి సరిగ్గా ఉంటే స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. లెక్కల ప్రకారం అక్కడ ఫర్నీచర్ లేకపోతే ఏం చేయాలనే దాని పైన వారు స్పీకర్ ను సంప్రదించే ఛాన్స్ ఉంది. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ అధికారులు కోడెల కార్యాలయానికి వెళ్లనున్నారనే సమాచారంతో కార్యాలయం పరిసరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ దొంగతనం జరిగిందనే సమాచారంతో ప్రతీ అంశాన్ని పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. గతంలో పని చేసిన సిబ్బంది ఎందుకు దొంగతనం చేసారు..ఎందుకు వదిలేసారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి కాసేపట్లో దీని పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఫిర్యాదు చేయకపోవటం వెనుక..
కోడెల కార్యాలయంలో కంప్యూటర్లు మాయం అయ్యాయనే అంశం పైన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే దాని పైన చర్చ మొదలైంది. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో..దొంగతనం జరిగితే ఫిర్యాదు చేయకపోవటం ఏంటనేది ఇప్పుడు చర్చ. గతంలో పని చేసిన ఉద్యోగి దొంగతనానికి ఎందు చేస్తాడు..అక్కడే సమీపంలో వాటిని ఎందుకు వదిలేసి వెళ్తాడు.. కంప్యూటర్ ను తీసుకెళ్లి..దాని నుండి ఏదైనా సమాచారం తొలిగించటానికే దొంగతనం చేసాడా అనే కోణం లో విచారణ సాగుతోంది. ఫర్నీచర్ తరలింపు వ్యవహారం పైన రగడ కొనసాగుండగానే...ఇప్పుడు కోడెల కార్యాలయంలో దొంగతనం వ్యవహారం మరో వివాదాస్పద అంశంగా మారుతోంది.