‘జూ. ఎన్టీఆర్నూ వదల్లేదు.. టీడీపీ, బాలకృష్ణ ఆఫీస్ నుంచే దుష్ప్రచారం’
అమరావతి: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు వేసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జగన్ క్రైస్తవుడే.. కానీ, బాబు రాక్షసుడిలా, టీడీపీది ముగిసిన అధ్యయమే: రామచంద్రయ్య నిప్పులు
టీడీపీ, బాలకృష్ణ ఆఫీస్ నుంచే..
తెలుగుదేశం పార్టీ కార్యాలయం, టీడీపీ ఎమ్మెల్యే, సినీ హిరో నందమూరి బాలకృష్ణ ఆఫీస్ నుంచి వైసీపీపై తప్పుడు పోస్టులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్ మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్నూ వదల్లేదు..
చంద్రబాబుపై ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న చంద్రబాబును వెంటనే ఆస్పత్రిలో చేర్పించి సరైన చికిత్స అందించాలని అన్నారు. సినీ హీరో జూనియర్ ఎన్టీర్ను కూడా చంద్రబాబు, ఆయన పార్టీలోని కొందరు నేతలు వదల్లేదని మండిపడ్డారు.
బాబును అసహ్యించుకుంటున్నారు..
మహిళలు వినలేని మాటలను చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన తీరును సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని సుధాకర్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టును జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు కాదా?
జూనియర్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయించింది నిజం కాదా? అని సుధాకర్ నిలదీశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.