గుంటూరులో కరోనా కలకలం: ఇద్దరు అటెండర్లకు సోకిన వైరస్, 190 కుటుంబాల ఆందోళన...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం తక్కువ కేసులు నమోదైన.. శనివారం మాత్రం మళ్లీ పెరిగాయి.. 70 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వలసకూలీలు, కోయంబేడు మార్కెట్ లింకు తదితర కేసులు 61 వరకు నమోదయ్యాయి. మొత్తం కలిపితే 131 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గుంటూరులో కరోనా కలకలం రేగింది. ఇద్దరు అటెండర్లకు వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు.
శ్యామలానగర్ స్కై లార్క్ అపార్ట్ మెంట్ ఎదుట సహకారశాఖ కార్యాలయం ఉంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఇక్కడ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరు అటెండర్లకు కరోనా వైరస్ సోకిందనే విషయం తెలిసి అపార్ట్ మెంట్ వాసుల గుండె గుబేల్ మంది. మరో ఇద్దరినీ కూడా అధికారులు గుర్తించారు. అటెండర్లను ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
రెండురోజుల క్రితం అపార్ట్ మెంట్ ఆర్6 బ్లాక్ ప్లాట్ నంబర్ 506లోకి ఒక ఫ్యామిలీ చెన్నై నుంచి వచ్చిందని తెలుస్తోంది. వీరి వల్లే అటెండర్లకు సోకిందా అనే అనుమానం కలుగుతోంది. కానీ దీనిపై అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరో ఇద్దరికీ వైరస్ ఎలా వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత రావడం లేదు. ఆ అపార్ట్ మెంట్లో 190 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇద్దరు అటెండర్లకు వైరస్ వచ్చిందని తెలయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అపార్ట్ మెంట్ ముందు, సహకారశాఖ కార్యాలయం వద్ద స్ప్రై చేశారు.