ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు: గుంటూరులో కలకలం: టీడీపీ అనుమానాలన్నీ ప్రతిపక్ష పార్టీ పైనే
గుంటూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం చెలరేగింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరులోని స్థంభాల గరువు, నెహ్రూనగర్, ఏటుకూరు రోడ్డుల్లో ఎన్టీ రామారావు విగ్రహాలను ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి వాటికి నిప్పుపెట్టారు. సోమవారం ఉదయం స్థానికులు ఈ విషయాన్ని గుర్తించారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహాల వద్దకు చేరుకున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఇది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల పనేనంటూ కొందరు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించిన సందర్భంగా వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.