కోడెల మంచి వైద్యుడు.. కానీ రాజకీయ జీవితం వివాదాస్పదం... 2019 ఎన్నికల్లో ఓటమినుంచి అధపాతాళానికి....
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మట్టిలో కలిసిపోయారు. నరసారావుపేటలో తాను కట్టించిన స్వర్గపురి శ్మశానంలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. కుటుంబసభ్యుల రోదనలు, బంధువులు, సన్నిహితుల ఆశ్రునయనాల మధ్య కోడెల శివప్రసాద్ అంత్యక్రియల ఘట్టం ముగిసింది. దీంతో కోడెల శివప్రసాద్ జీవితంలో జరిగిన ఘట్టాలను ఓ సారి పరిశీలిద్దాం. డాక్టర్ నుంచి యాక్టర్ అవుతారు కొందరు .. కానీ కోడెల డాక్టర్ నుంచి పొలిటిషీయన్ అయ్యారు.
వైద్య వృత్తిలోకి ఇలా ..
కోడెల చిన్నప్పుడు కుటుంబసభ్యులకు స్మాల్ పాక్స్ వచ్చి చనిపోయారు. దీంతో ఎలాగైన వైద్య విద్య అభ్యసించాలని పట్టుబట్టి మరీ పూర్తిచేశారు. తర్వాత నరసరావుపేటలో వైద్యుడిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవలను చూసి దివంగత ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారని చెబుతుంటారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఎన్టీఆర్తో సన్నిహితంగా మెలిగారు కోడెల శివప్రసాద్. 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి అప్రతిహతంగా గెలుపొందుతూ వచ్చారు. మంత్రిగా పనిచేసి వైరిపక్షాల మన్ననలు కూడా పొందారు. కానీ స్పీకర్గా పనిచేసి .. తర్వాత ఓడిపోయి అభాసుపాలయ్యారు.
విజయాలు-వివాదాలు
1987-1988లో ఉమ్మడి రాష్ట్రంలో కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా పనిచేశారు. కానీ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల్లో జరుగుతున్న అధిపత్యంలో కోడెల కూడా ఫ్యాక్షనిస్ట్ అయ్యారనే ఆరోపణలు వినిపించాయి. ఆయన హోంమంత్రిగా ఉన్న సమయంలోనే పెరటిలో బాంబు పేలింది. నలుగురు చనిపోవడం కలకలం రేపింది. మరోసారి యాసిడ్ దాడి కూడా జరిగింది. స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.హోంమంత్రిగా ఉన్న సమయంలో 1988 డిసెంబర్ 26న వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. కాపు నేత హత్యకు ఎన్టీఆర్, కోడెల కుట్ర పన్నారని అప్పట్లో ఆరోపణలు కూడా వినిపించాయి. ఎన్టీఆర్తో సన్నిహితంగా మెలిగి .. మంత్రి పదవీ చేపట్టారు. చంద్రబాబుతో కూడా సన్నిహితంగా ఉంటూ ఆమాత్య పదవీ చేపట్టారు. 2004, 2009లో మాత్రం కోడెల పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో వైఎస్ హవా ఉండటంతో ఓటమి తప్పలేదు. తన ఓటమి కసిని వైఎస్ కుమారుడు జగన్పై గత ప్రభుత్వ హయాంలో తీర్చుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
చివరలో అపజయం
నరసరావుపేటలో ఐదుసార్లు, సత్తెనపల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు కోడెల శివప్రసాద్. మంత్రిగా, స్పీకర్గా విధులు నిర్వర్తించారు. కానీ సత్తెనపల్లిలో అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి కే ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో కోడెల తన ప్రత్యర్థి అంబటి రాంబాబు చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇక అప్పటినుంచి కోడెలను కష్టాలు చుట్టుముట్టాయి. విపక్షంగా ఉన్నప్పుడు కోడెల వ్యవహరించిన తీరుతో .. సీఎం జగన్ కూడా రివెంజ్ ప్రారంభించారనే వాదనలు వినిపించాయి. కే ట్యాక్స్ గురించి కోడెల కూతురు, కుమారుడిపై కేసులు నమోదు.. ఇంత జరుగుతున్న టీడీపీ నుంచి మద్దతు లభించలేదు. దీంతో కోడెల తీవ్ర మనస్దాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆత్మహత్యకు దారితీసిన మానసిక వేదన ..
హైదరాబాద్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న కోడెలను .. బసవతారకం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. ఒకప్పుడు ఆస్పత్రి చైర్మన్గా పనిచేసిన కోడెల .. అదే దవాఖానలో నిర్జీవంగా పడి ఉండటం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అక్కడ వైద్యులు కోడెల చనిపోయారని చెప్పడంతో ఆయన అభిమానులు షాక్నకు గురయ్యారు. బసవతారకం నుంచి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి నేరుగా టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. మరునాడు అమరావతి తీసుకెళ్లి .. బుధవారం సాయంత్రం నరసారావుపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. నరసరావుపేటలో తాను నిర్మించిన స్వర్గపురి శ్మశానంలోనే అనంతలోకాలకు పయనమయ్యారు.