మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు కారణమిదేనా ..?
హైదరాబాద్/ అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్గా పనిచేశారు. కానీ అతని కుమారుడు, కూతురు చేసిన అరాచకాలు గత ఎన్నికల్లో ఓటమికి నాంది పలికాయి. దీంతో గత ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. వైసీపీ సర్కార్ పగ్గాలు చేపట్టిన తర్వాత సత్తెనపల్లిలో కే ట్యాక్స్ అరచాకాలు వెలుగులోకి వచ్చాయి. కే ట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ .. చేసిన వసూళ్లు బయటకొచ్చాయి.
రాజకీయ వేధింపులే కోడెల మరణానికి కారణమా ? శోక సంద్రంలో తెలుగు తమ్ముళ్ళు
కారణమిదేనా ..?
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టాక .. సత్తెనపల్లిలో జరిగిన అరాచకాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా కోడెల కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ ముక్కుపిండి వసూల్ చేసిన వైనం కలకలం రేపింది. కాంట్రాక్టులు ఇప్పిస్తామని లక్షలకు లక్షలు దండుకుంటున్నారని బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ... సత్తెనపల్లిలో కే ట్యాక్స్ వసూళ్లు తెరపైకి వచ్చాయి. తొలుత పద్మావతి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె తర్వాత వరసగా ఒక్కొ బాధితులు మీడియా ముందుకొచ్చారు. కే ట్యాక్స్ ఏంటీ ? ఏం పేరుతో వసూళ్లు చేశారు ? ఎంత గుంజారు ? అనే అంశం అప్పట్లో మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో జగన్ సర్కార్ కేసులు పెట్టింది. బాధితులు సీబీఐ లేదా సిట్ చేత విచారణ జరిపించాలని కోరడంతో ... కే ట్యాక్స్ మరింత హైప్ తీసుకొచ్చింది. జగన్ సర్కార్ పెట్టిన కేసులతో కోడెల శిప్రసాద్ ఆత్మన్యూనత భావానికి లోనయ్యారు. గత కొన్నాళ్లు మీడియాకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇటీవల గుండెపోటు రావడం .. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. తర్వాత హైదరాబాద్ ఇంటికొచ్చి .. ఒంటరిగానే ఉన్నారని తెలుస్తోంది. కేసులతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
కే ట్యాక్స్ అంటే ..
ఏపీలో కోడెల శివప్రసాద్కు మంచి గుర్తింపు ఉంది. తన తండ్రి పేరును కూతురు విజయలక్ష్మీ, కుమారుడు శివరామకృష్ణ ఎడపెడ వాడుకున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శించి అందినకాడికి దోచుకున్నారు. వీరి హయాంలో జరిగిన దోపిడిని అప్పటి విపక్ష వైసీపీ కే.ఎస్.టీ (కోడెల సర్వీస్ టాక్స్)గా పిలుచుకున్నారు. అధికారం మారడంతో బాధితులు ఒక్కొక్క బాధితులు బయటకు వస్తున్నారు. కోడెల కూతురు విజయలక్ష్మీ మోసం చేసిందని బాధితురాలు పద్మావతి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరులో ఎకరం భూమి తనకు ఉందని ఆమె తెలిపారు. ఆ భూమిపై కన్నుపడ్డ విజయలక్ష్మీ నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగిందని వాపోయారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో .. రూ.15 లక్షలు ఇవ్వాలని కోరితే భయపడి ఇచ్చామని తెలిపారు. కానీ తర్వాత మరో .5 లక్షలు ఇవ్వాలని వేధింపులకు దిగుతుందని నిట్టూర్చారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పిన వినకుండా .. బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు పద్మావతి. తర్వాత ఒక్కొక్కరు ఫిర్యాదు చేశారు.
ఒక్కటి కాదు.. రెండు కాదు ...
సత్తెనపల్లి రాజధాని సమీప ప్రాంతం కావడంతో .. కోడెల కూతురు, కుమారుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, అంతేందుకు కేబుల్ వ్యవహారాల్లో కూడా దూరి అందినకాడికి దోచుకున్నారు. వరి పంట కోత తర్వాత గడ్డి స్కాం చేసి కోడెలకు మచ్చ తీసుకొచ్చారు. తన కూతురు, కుమారుడు ఇన్ని చేస్తున్నా మిన్నకుండిపోవడమే కోడెల చేసిన తప్పిదమైపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదీ చేస్తాం, ఇదీ చేస్తామని లక్షలు దండుకున్న వారు ... ఒకరికి కూడా పనిచేయలేదు. ఆ సమయంలో అదేంటీ అనే అడిగే ధైర్యం చేయలేదు బాధితులు. ఎందుకంటే అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నందున .. ఆందోళన చేపట్టిన తిరిగి కేసు పెడతారని భయపడ్డారు.
ధైర్యం చేసి ..
వైసీపీ అధికారంలోకి రావడంతో కోడెల కుమారుడు, కూతురు లీలలు బయటకు వచ్చాయి. వైసీపీ సర్కార్ స్పందించి కేసులు పెట్టడంతో ... కోడెల కుటుంబంలో కలవరం మొదలైంది. తన ఎకరాం భూమి కోసం పద్మావతి బయటకు రావడంతో కోడెల కూతురు విజయలక్ష్మీ అరాచకాలు సమాజానికి తెలిసింది. మిగతా వారు కూడా జట్టుగా ఏర్పడ్డారు. తాము వివిధ ఉద్యోగాల కోసం ఇచ్చిన నగదు, ఆధారాలను బయటపెట్టారు.