కోడెలను కాపాడుకోకపోగా.. విమర్శలా? ఓ వైపు కుటుంబం, మరోవైపు చంద్రబాబు.. మానసిక వేదనతోనే...
అమరావతి : కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తే .. సంబంధిత వ్యక్తి స్పందించాలా ? మిగతా నేతలు మాట్లాడారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు అన్నివిధాలా సహాయం చేసిన కోడెల శివప్రసాద్ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి .. అవమానించారని విమర్శించారు. ఓ వైపు కుటుంబసభ్యులు, మరోవైపు పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
టీడీపీ జెండానే ..
కోడెల శివప్రసాద్ 1983లో ఎన్టీఆర్తో టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. టీడీపీలో ఎన్ని రాజకీయ సంక్షోభాలు వచ్చినా .. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారే తప్ప మారలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా స్పీకర్గా కాకుండా రాజకీయ నేతగా చంద్రబాబుకు సాయం చేయలేదా అని ప్రశ్నించారు. అందులో నలుగురు మంత్రులు చేసినా మిన్నకుండిపోయారని గుర్తుచేశారు. ఫర్నీచర్ అంశానికి సంబంధించి వర్ల రామయ్యతో వ్యాఖ్యలు చేయించలేదా అని నిలదీశారు.
కుంగి, కృసించి ..
చంద్రబాబు చేసే నీచ రాజకీయాలను చూసిన కోడెల శివప్రసాద్ కుంగిపోయారన్నారు. ఇటు కూతురు, కుమారుడు చేసిన పనులు కూడా తలంపు తీసుకొచ్చాయన్నారు. అందుకోసమే గత నెల 23న తొలిసారి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో గుంటూరులో మనోహర్ దవాఖానకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దానిని టీడీపీ నేతలు, బంధువులు, కుటుంబసభ్యులు మసిపూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. ఆ సమయంలో సత్తెనపల్లి, నరసరావుపేట నుంచి కార్యకర్తలు వచ్చారే తప్ప చంద్రబాబు ఎందుకు రాలేదని అడిగారు. వారం రోజులు ఆస్పత్రిలో ఉన్న .. పక్కనే పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు .. కోడెల వద్దకు రాలేదన్నారు. కొందరు చొరవ తీసుకొని వెళ్లాలని కోరినా .. స్పందించలేదన్నారు. ఈ విషయాన్ని కోడెల అల్లుడు మనోహర్కు చెబితే ఆయన చంద్రబాబు వద్దకెళ్తే .. బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. నీ భార్య, బావమరిది చేసినా పనులే ఓటమికి కారణమైందని దూషించలేదా అని నిలదీశారు అంబటి.
కాపాడుకోకపోగా ..
కాపాడుకోవాల్సిన వ్యక్తిని కాపాడుకోలేదు. పైగా ఆత్మహత్య చేసుకుంటే వైసీపీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఓ వైపు కుటుంబం కలిసి రాకపోగా, మరోవైపు పార్టీ కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. దీంతో మానసిక వేదనలో మరణం తప్ప మారో మార్గం లేకుండా పోయిందన్నారు. అందుకోసమే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్నారు అంబటి. బతికున్నప్పుడు కోడెలను చూడని బాబు .. చనిపోయాక దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కోడెలపై నిజంగా ప్రేమ ఉంటే సత్తెనపల్లి నుంచి కోడెల కూతురు విజయలక్ష్మీ, నరసరావుపేట నుంచి కుమారుడు శివరామకృష్ణను పోటీ చేయించాలని డిమాండ్ చేశారు.
ఒంటరిని చేసి
కోడెల శివప్రసాద్ను మానసికంగా వేధించింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. సత్తెనపల్లిలో రాయపాటి రంగాను ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు. అన్న క్యాంటిన్ల వద్ద కోడెల, రాయపాటి రంగా వర్గాలు కొట్టుకునేట్లు చేయలేదా అని అడిగారు. చంద్రబాబు దొంగ నాటకాలను ప్రజలు గనమిస్తున్నారని చెప్పారు. కోడెల మృతిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పల్నాటి పులిని ఉరేసుకొనేలా చేసిన ఘనుడు చంద్రబాబు అని ఆరోపించారు అంబటి రాంబాబు