కొండను తవ్వి ఎలుకను పట్టారు... పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే: ఐటీ దాడులపై లోకేష్ ట్వీట్
అమరావతి: గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురి ప్రముఖలు ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా టీడీపీ నేతలపైనే ఈ దాడులు అధికంగా జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై గత కొద్దిరోజులుగా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల వ్యాపారాలపై, వారి లావాదేవీలపై ఐటీశాఖ దృష్టి సారించింది. ఇక సోదాల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేత మాజీమంత్రి నారాలోకేష్ స్పందించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటూ సీఎం జగన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. జగన్కు అవినీతి కనిపించడంలో పెద్దగా ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించిన నారా లోకేష్... ఐటీ రైడ్స్లో కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే రూ.85 లక్షలు దొరికాయని ఐటీ శాక చెబుతుండగా చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2వేల కోట్లు దొరికాయని జగన్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు లోకేష్. అంతేకాదు వైసీపీ నేతలు ఈ వార్త చూసి శునకానందం పొందుతున్నారని విమర్శించారు.
ఇన్ఫ్రా కంపెనీలో జరిగిన ఐటీ దాడులకు వైసీపీ నాయకులు టీడీపీకి ముడిపెట్టే ప్రయత్నం చేసేందుకు తెగ తాపత్రయపడుతున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే విచారణ జరిపిస్తారని ఆపై చర్యలు తీసుకుంటారని చెప్పిన లోకేష్.. అక్కడి కంపెనీల్లో దాడులు జరిగితే టీడీపీకి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్లి వచ్చినందున అందరూ జైలుకు వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినప్పటికీ... అలాంటి కోరికలు తమకు లేవని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టిడిపి కి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవు.. (4/4)
— Lokesh Nara (@naralokesh) February 14, 2020