చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు ... రీజన్ ఇదే
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మీడియా సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై,డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు.
జగన్ కంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెయ్యిరెట్లు మేలని ఆరోపణలు చేసి ఇక అదే సమయంలో డీజీపీ ఆఫీస్ ను వైసీపీ ఆఫీస్ గామార్చారని విమర్శలు చేశారు . టిడిపి ఎమ్మెల్యేలు వెళితే డిజిపి ఎందుకు కలవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేసారు. వై ఎస్ వివేకా హత్య గురించి టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడకూడదని ఆయన డీజీపీని ప్రశ్నించారు. డీజీపీ తనకు నోటీసులు పంపిస్తానని అంటున్నారని నోటీసులు పంపాలని పేర్కొన్నారు చంద్రబాబు.
ఇక డీజీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈమేరకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నాయకులు విడదల రజని, మహ్మద్ ముస్తఫా తదితరులు ఫిర్యాదు చేశారు. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని, డీజీపీ గౌతం సవాంగ్ పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, వర్ల రామయ్యను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని విమర్శించారు. పోలీసులను, వైసీపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్న చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితవు పలికారు.