ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి పై విచారణ: ఆధారాలతో రావాలని సమన్లు: గతంలోనే రాష్ట్రపతికి ఫిర్యాదు..!
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే సామాజిక వర్గం వివాదం పైన విచారణ మొదలైంది. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదంటూ ఫిర్యాదులు వచ్చాయి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఈ వ్యవహారం మీద జిల్లా కలెక్టర్ తో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం..రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదు చేసింది. దీని పైన నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ అప్పటి సీఎస్ కు లేఖ రాసింది. ఇక, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుండి వచ్చిన లేఖ ఆధారంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే విచారణ కోసం సమన్లు జారీ చేసారు. ఈ నెల 26న విచారణకు రావాలని సూచించారు. ఎమ్మెల్యే తాను ఎస్సీ అని నిరూపించుకొనే విధంగా అవసరమైన పత్రాలు..బంధువులను వెంట తెచ్చుకోవచ్చాని జేసీ సూచించారు. ఈ వ్యవహారం గతంలోనే రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.
జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి .. డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమీషన్
అధికార పార్టీ ఎమ్మెల్యే కుల వివాదం..
ఏపీలో అధికార వైసీపీ నుండి తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కుల వ్యవహారంలో విచారణ మొదలు కానుంది. గత ఏడాది నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో తనను కులం పేరుతో కొందరు దూషించారంటూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేసారు. ఆ తరువాత ఎమ్మెల్యేను దూషించిన వారి పైన కేసు నమోదు చేసారు. అప్పుడే, అసలు శ్రీదేవి ఎస్సీ కాదనే వివాదం మొదలైంది. దీని పైన అప్పట్లోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో.. ఎస్సీ కాని ఎమ్మెల్యే ఆ చట్టం కింద పెట్టిన కేసులు ఎలా నిలుస్తాయని ప్రశ్నించారు. దీనికి సంబంధించి అప్పటి నుండి రాజకీయంగా వివాదం కొనసాగుతూనే ఉంది.
ఎమ్మెల్యే కులం పై విచారణ జరపాలంటూ..
ఇదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవి కుల వివాదం పైన విచారణ జరపాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదులు చేసింది. జిల్లా కలెక్టర్ తో పాటుగా.. ఎన్నికల సంఘం..రాష్ట్రపతి భవన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పైన రాష్ట్రపతి భవన్ విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇక, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా జయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీదేవికి సమన్లు పంపారు. ఈ నెల 26న మధ్నాహ్నం విచారణకు రావాలని సూచించారు. తప్పుడు ధ్రువీకరణను దాఖలు చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం ఫిర్యాదులో పేర్కొంది.
శ్రీదేవి చేసిన వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ..
ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించారంటూ నియోజకవర్గంలో కొందరి మీద కుల దూషణ కేసు నమోదు చేసారు. దీంతో..టీడీపీ నేతలు అప్పట్లోనే స్వయంగా శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తాను క్రిస్టియన్ అని... తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరానికి చెందిన వారు దృష్టిసారించారు. చట్ట ప్రకారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఇక, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నిర్వహించే విచారణలో శ్రీదేవి తాను ఎస్సీ అనే విషయం నిరూపించుకోవాల్సి ఉంటుంది. విచారణ పూర్తయిన తరువాత జేసీ సమర్పించే నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.