వెరైటీ వంటలతో అలరించిన యూట్యూబ్ సెన్సేషన్ బామ్మ ఇక లేరు..!
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బామ్మ గుర్తింది కదూ...ఈ బామ్మ పేరు మస్తానమ్మ. బామ్మ కంటే ఆమె చేసే వంటలే ఇంకా బాగా గుర్తుండిపోతాయి. ఈ బామ్మ చేతినుంచి తయారైన నాన్ వెజ్ వంటకం ఏదైనా సరే లొట్టలేసుకుంటూ తినేయాలనిపిస్తుంది. తన వంటతో రాత్రి రాత్రికే యూట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. వందేళ్ల వయసులోను చాలా యాక్టివ్గా వంటలు చేయడం వాటిని తమ కుటుంబ సభ్యులు యూట్యూబ్లో పెట్టడంతో ఈ బామ్మ ఇంటర్నెట్ స్టార్ అయ్యారు. అప్పట్లో జాతీయ అంతర్జాతీయ మీడియాలు కూడా ఈ బామ్మ ఎక్కడుంటుంది.. ఈమె స్పెషాలిటీ ఏమిటి అని తెలుసుకునేందుకు తెగ ప్రయత్నించారు. దీన్ని బట్టే ఈ బామ్మ ఎంత స్పెషలో అర్థమవుతుంది.
ఓవర్ నైట్ స్టార్ అయిన మస్తానమ్మ
గుంటూరు జిల్లా తెనాలి పక్కనే ఉన్న గుడివాడ అనే చిన్న గ్రామంకు చెందిన ఈ బామ్మకు రాని వంట అంటూ లేదు. ఏ వంటైనా సరే ఇట్టే చేసేస్తుంది. ఎంతో రుచిగా కూడా వండుతుంది. కానీ ఇప్పుడు బామ్మ వంట తినే అవకాశం ఇక లేదు. ఎందుకంటే బామ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన వంటలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారితో పాటు విదేశీయులను కూడా పలకరించే బామ్మ... ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. దేశీయ వంటలైన విదేశీయుల వంటలైనా బామ్మ చేతిలో పడిందంటే ఆహా అనాల్సిందే మరి. మస్తానమ్మ ఒక వంట మొదలు పెట్టి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే చాలు ఇక చాలామంది ఇళ్లలో ఆ వంటకం దర్శనమిస్తుంది. అంతలా ఇంటర్నెట్లో బామ్మ పాపులారిటీ సంపాదించింది.
బామ్మ యూట్యూబ్ ఛానెల్కు 2లక్షల సబ్స్క్రైబర్లు
తన బామ్మ చేసే వంటకాలు ఎలాగైనా ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తన మునిమనవడు లక్ష్మణ్ కంట్రీ ఫుడ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఆమె వంటకాల వీడియోలను అప్లోడ్ చేశాడు. అంతే ఒక్క రాత్రిలో ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారు. ఆ ఛానెల్కు దాదాపు 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ముందుగా ఆమె చేసిన ఓ దేశీయ వంటకాన్ని అప్లోడ్ చేసినట్లు చెప్పిన లక్ష్మణ్ దాన్ని మూడు మిలియన్ మంది చూసినట్లు చెప్పారు. దీంతో "వాటర్ మిలన్ చికెన్ బై మై గ్రానీ " పేరుతో మరో వీడియోను అప్లోడ్ చేసినట్లు చెప్పారు. దీన్ని 8 మిలియన్ మంది వీక్షించడం ఆ తర్వాత వీడియో వైరల్ అవడంతో యూట్యూబ్ ఛానెల్ క్లిక్ అయ్యిందన్నారు.
బామ్మ వంటలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు
బామ్మ చేతిలో ఏం మంత్రం ఉందో తెలియదుగానీ... ఆమె చేసిన ఏ వంటకం అయినా సరే బహు రుచిగా మళ్లీ మళ్లీ తినేలా ఉంటుందని లక్ష్మణ్ చెప్పేవారు. అందుకే ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. వంట కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తుంది మస్తానమ్మ. యూట్యూబ్ సెన్సేషన్ కాకముందు ఆమె వందేళ్ల వయసులోనూ చాలా చలాకీగా పొలాల్లో పనిచేస్తూ ఉండేది . 11 ఏళ్లకే పెళ్లి చేసుకున్న మస్తానమ్మ తనకు 22 ఏళ్ల వయస్సు వచ్చేసరికి భర్తను కోల్పోయింది. తన భర్తను తాను ఎంతో మిస్ అవుతుంటానని కూడా అప్పట్లో మస్తానమ్మ చెప్పి తనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. "ఐదు మంది పిల్లలతో నీవు లేకుండా ఎలా బతకగలను " అని తన భర్తను అడిగితే.. అప్పుడు తన భర్త ఆమె చేతిని పట్టుకుని "నువ్వు చాలా తెలివైనదానివి గట్టి దానివి నువ్వు ఎలాగైనా బతికేస్తావు" అంటూ భర్త మాటలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు మస్తానమ్మ.