ఏపీలో ఆ స్కీమ్ కింద నిధులు విడుదల: ఆ జిల్లా పర్యటనకు జగన్
బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి బాపట్ల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బహిరంగసభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా అధికారులు సమీక్ష నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద వైఎస్ జగన్ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద నిధులను విడుదల చేయడం ఇది మూడవసారి. రాష్ట్రంలో అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. పేద విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కింద అందజేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీతోో పాటు ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులకు కూడా ఇది వర్తిస్తోంది.
Recommended Video
ఆయా కోర్సులను చదివే పేద విద్యార్థులు తమ కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది ఈ పథకం కింద. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన నిధుల మొత్తం 709 కోట్ల రూపాయలను వైఎస్ జగన్ ఇదివరకే విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థుల తల్లుల అకౌంట్లల్లోకి ఈ నిధులను బదలాయించారు.
అప్పట్లో 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో లబ్దిదారుల సంఖ్య మరింత పెరగొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్తవారికి అవకాశం ఇచ్చినందున నిధుల మొత్తంతో పాటు లబ్దిదారుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా బాపట్లలో నిర్వహించనున్న బహిరంగ సభకు లక్షమందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు అంచనా వేస్తోన్నారు.