అన్నకు తోడుగా చెల్లెలు: ఎన్నికల ప్రచార బరిలో వైఎస్ షర్మిళ.. బహిరంగ సభలు, రోడ్ షోలు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ కు అట్టే సమయం లేకపోవడం వల్ల అన్ని పార్టీలూ యుద్ధ ప్రాతిపదికన ప్రచార బరిలో దిగాయి. మండుటెండలను లెక్క చేయకుండా ఆయా పార్టీల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తున్నందున.. ఆయా పార్టీల అధినేతలు, నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు సాగిస్తున్నారు.
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం..శిథిలాల మధ్య చిక్కుకున్న కార్మికులు
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఒంటి చేత్తో ఎన్నికల ప్రచారాన్ని చుట్టబెడుతున్నారు. ఒంటరిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా- వైఎస్ జగన్ కు తోడుగా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిళ ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారు. ఈ నెల 27వ తేదీన ఆమె తొలి బహిరంగ సభను గుంటూరులో నిర్వహించబోతున్నారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వైఎస్ఆర్ సీపీ జిల్లా నాయకులు తమ భుజాలకు ఎత్తుకున్నారు. గుంటూరులో తొలి బహిరంగ సభ ముగించుకున్న అనంతరం వైఎస్ షర్మిళ.. వరుసగా రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. దశలవారీగా గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆమె పలు ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల సభల్లో పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను రూపొందిస్తున్నారు. జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిళ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.