అంబటి రాంబాబుకు సొంత పార్టీ కార్యకర్తల షాక్- అక్రమ మైనింగ్పై హైకోర్టులో పిల్..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీ కార్యకర్తలే షాకిచ్చారు. అదీ సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలే. ఏకంగా తమ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది.
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఇవాళ ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. హైకోర్టు న్యాయవాది నాగరఘు ఈ వాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ వాజ్యం తాను వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేస్తున్నట్లు చెప్పడంతో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. అధికార పార్టీ అయిన వైసీపీ కార్యకర్తలే పిటిషన్ వేస్తే అది ప్రజాప్రయోజన వాజ్యం ఎలా అవుతుందంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Recommended Video
ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నట్లు కలెక్టర్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్లో ఆరోపించడం విశేషం. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్ధానిక మైనింగ్ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్లో వీరు పేర్కొన్నారు. దీంతో దీనిపై పూర్తి నివేదిక కోరుతూ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.