అమరావతిలో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ అవేనా ? వ్యూహరచనలో ఎమ్మెల్యే... టీడీపీకి భారీ షాక్ తప్పదా ...!
ఏపీ రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాల్లో అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగిస్తున్న వైసీపీ సర్కారు ఇప్పుడు టీడీపీకి చెందిన పలు ఆస్తులపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు గుంటూరు పట్టణంలోని పార్టీ ఆఫీసు వ్యవహారాల కూపీ లాగుతోంది. నిబంధనల ఉల్లంఘన, లీజుల అక్రమాల పేరుతో త్వరలో ఈ రెండింటిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తుది దశకు అమరావతి ఆపరేషన్..
ఏపీలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతిలో చోటు చేసుకున్న పలు అక్రమాలకు సంబంధించి ఇప్పటికే సీఐడీ ద్వారా కేసులు నమోదు చేయించిన వైసీపీ సర్కారు.. ఈ ప్రాంతంలో టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా తర్వాతి దశలో టీడీపీ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోబోతోంది. నిబంధనల ఉల్లంఘన పేరుతో ఇప్పటికే మంగళగిరిలోని ఆత్మకూరు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపిన పురపాలక శాఖ త్వరలో వీటిపై చర్యలకు ఉపక్రమించబోతోంది. అలాగే గుంటూరులోని టీడీపీ నగర కార్యాలయం లీజు విషయంలో అక్రమాలను బయటపెట్టబోతోంది.
టీడీపీ కేంద్ర కార్యాలయమే లక్ష్యం...
2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించాక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అధికార టీడీపీకి మూడున్నర ఎకరాలు, విపక్షాలకు అర ఎకరం చొప్పున రాజధానిలో పార్టీ కార్యాలయాల కోసం భూములు కేటాయించింది. ఇందులో భాగంగా టీడీపీ మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కేంద్ర కార్యాలయాన్ని నిర్మించుకుంది. అయితే ఈ ఆఫీసు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం నుంచి పొందిన మూడున్నర ఎకరాలతో పాటు పక్కనే ఉన్న ప్రైవేటు భూములను సైతం ఆక్రమించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సదరు ప్రైవేటు భూ యజమాని కేసులు కూడా పెట్టారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలకు అతిక్రమించి ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎందుకు కూల్చివేయకూడదో చెప్పాలంటూ గతంలో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మిగతా అక్రమాలను కూడా వెలికి తీసి టీడీపీ కార్యాలయం కూల్చివేతకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది వైసీపీ సర్కారు.
గుంటూరు టీడీపీ ఆఫీసు..
గుంటూరు పట్టణంలోని పిచ్చుకలగుంటలో రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ స్ధలాన్ని లీజుకు తీసుకుని టీడీపీ పట్టణ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. నగరం విస్తరించడం, రాజధాని రాక తర్వాత టీడీపీకి కేంద్ర కార్యాలయం లేకపోవడంతో దీన్నే రాష్ట్ర కార్యాలయంగా కూడా వాడుకున్నారు. అయితే 30 ఏళ్ల లీజు కాలంలో ఇప్పటికే దాదాపు పూర్తి కావడంతో ప్రభుత్వ అవసరాల మేరకు నిబంధనల మేరకు దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో లీజు కోసం చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తున్న ప్రభుత్వం.. త్వరలో నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చాక దీని కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.