వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు తప్పిన ప్రమాదం.. స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో..
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.శుక్రవారం తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆర్కే హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన వేదిక పైకి వెళ్లగా.. ఒక్కసారిగా వేదిక కుప్పకూలిపోయింది. దీంతో ఆర్కే కుడి పాదానికి గాయమవగా.. చికిత్స కోసం వెంటనే ఆయన్ను గుంటూరు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆర్కే ప్రమాదం గురించి తెలియగానే వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే పెద్దగా గాయాలేమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.పలువురు వైసీపీ నేతలు సైతం ఆయన్ను ఫోన్లో పరామర్శించినట్టు సమాచారం.
కాగా,గురువారం సీఎం జగన్కు ఎమ్మెల్యే ఆర్కే లేఖ రాసిన సంగతి తెలిసిందే. నీరుకొండ కొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు ఐనవోలులో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్దాపన చేశారని, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు. అయితే స్మృతి వనం ఏర్పాటు పనులు ఆగిపోయినట్లు లేఖలో ఆర్కే పేర్కొన్నారు. అదే స్థాయిలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం నీరుకొండలో ఏర్పాటు చేయాలని కోరారు.