రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి చికిత్స చేసిన వైసీపీ ఎమ్మెల్యే
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఒకరు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి అప్పటికప్పుడు, నడి రోడ్డు మీదే చికిత్స చేశారు. ఆమే డాక్టర్ ఎం శ్రీదేవి. తాడికొండ శాసన సభ్యురాలు. వృత్తిరీత్యా డాక్టర్.
ఆదివారం ఉదయం ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ లో లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. అనంతరం తన కారులో గుంటూరు వైపునకు బయలుదేరి వెళ్లారు. పెదకాకాని సమీపంలో.. జాతీయ రహదారిపై ఓ వ్యక్తి నడి రోడ్డు మీద తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన విషయాన్ని గమనించారు. ఏమి జరిగిందంటూ అక్కడ గుమికూడిన ఇతర వాహనదారులను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు వైపునకు బైక్ వెళ్తుండగా.. పెదకాకాని సమీపంలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. అదుపు తప్పిన బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. క్షణాల్లో స్పృహ కోల్పోయాడు.
అతణ్ని గమనించిన వెంటనే శ్రీదేవి స్పందించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె.. కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ క్షతగాత్రుడిని చూసీ, చూడనట్టు వదిలేయలేదు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేంత వరకూ శ్రీదేవి సంఘటనాస్థలంలోనే గడిపారు. అంబులెన్స్ వచ్చిన వెంటనే స్థానికులు.. ఆ వ్యక్తిని అంబులెన్స్ లోకి ఎక్కించారు.
అంబులెన్స్ లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతో శ్రీదేవి క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేశారు. గాయాన్ని తుడిచి కట్టుకట్టారు. ఇంజెక్షన్ ఇచ్చారు. తలకు గాయాలైనందున.. ఏ ఆసుపత్రికి వెళ్లాలో కూడా సూచించారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అంబులెన్స్ సిబ్బందికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.