ప్రజలకు శుభదినం.. అజ్ఞాతవాసికి దుర్దినం.. పవన్ను టార్గెట్ చేసిన వైసీపీ...
పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకోవాలన్న చంద్రబాబు కుట్రలను సమాధి చేసిన శుభదినం ఇది అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు ఇది శుభదినం అని, రాజధాని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు వంతపాడిన పవన్ కల్యాణ్కి దుర్దినం అన్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ప్రజల ఆకాంక్ష అని... ఇకనైనా అజ్ఞాతవాసి,ట్విట్టర్ నివాసి కళ్లు తెరవాలని ఎద్దేవా చేశారు.
బిల్లులకు గవర్నర్ ఆమోదంపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. దోపిడీయే లక్ష్యంగా చంద్రబాబు తీసుకొచ్చిన సీఆర్డీఏని రద్దు చేయడం శుభ పరిణామం అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది సాధించాలన్న ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం నెరవేరాలని కాంక్షించారు. జగన్ తన విజన్తో ఏపీని దేశంలోనే ప్రముఖ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పారు.
ఎంపీ భరత్ మార్గాని మాట్లాడుతూ.. మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్రానికి చాలా మేలు చేస్తుందన్నారు. రెండు రాజధానుల నడుమ ఉన్న గోదావరి జిల్లాలు అభివృద్ది చెందుతాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందన్నారు. శ్రావణ శుక్రవారం రోజే గవర్నర్ దీనికి ఆమోదం తెలపడం శుభ పరిణామం అన్నారు.
మరోవైపు టీడీపీ మాత్రం మూడు రాజధానుల బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది దుర్మార్గపు చర్య అని,అభివృద్దికి విఘాతం కలిగిస్తుందని విమర్శిస్తోంది. అటు బీజేపీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉంటామని చెబుతున్నప్పటికీ భిన్న స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక మొదటి నుంచి రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. అమరావతి రైతులకు అండగా నిలబడుతామని చెప్పారు.