దమ్ముంటే నిరూపించగలరా? చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్
Recommended Video
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించిన వివాదం మరో రూపాన్ని సంతరించుకుంది. వినాయక చవితి సందర్భంగా గణేషుడి విగ్రహానికి పూజలు చేయడానికి వచ్చిన ఆమెను కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కులం పేరుతో దూషిస్తూ అడ్డుకున్న సందర్భంగా చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం శ్రీదేవి కులాన్ని అనుమానిస్తూ కామెంట్ చేయడంతో ఈ రచ్చ కాస్త పతాకస్థాయికి చేరుకున్నట్టయింది. తన భర్త కాపు కులస్తుడని, దళితురాలినైన తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానంటూ శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
చంద్రయాన్-2: జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగేది ఇలా: వైరల్ గా మారిన ఇస్రో వీడియో
చంద్రబాబు ట్వీట్ పై ఆగ్రహం..
ఈ ఇంటర్వ్యూలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేశారు. క్రైస్తవురాలిని దళితమహిళగా చెప్పుకొంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దళితులకు కేటాయించిన రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాన్ని క్రైస్తువురాలికి కట్టబెట్టారని చంద్రబాబు ఆ ట్వీట్ లో ఆరోపించారు. చంద్రాబాబు చేసిన ట్వీట్ పై ఉండవల్లి శ్రీదేవి భగ్గుమన్నారు. ఏ కులానికి చెందిన మనిషయినా ఏదో ఒక ధర్మాన్ని అనుసరించడం తప్పా? అని నిలదీశారు. అగ్రవర్ణాలకు చెందిన వారు క్రైస్తవాన్ని అనుసరించట్లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సామాజిక వర్గంలో ఎంతమంది క్రైస్తవాన్ని అనుసరించట్లేదని, వారంతా క్రైస్తవులేనా? అని అన్నారు.
క్రైస్తవాన్ని అనుసరిస్తే.. కులం కాకుండా పోతుందా?
క్రైస్తవ మతాన్ని అనుసరించినంత మాత్రాన కులం.. కులం కాకుండా పోతుందా? అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారామె. ఈ మేరకు శుక్రవారం ఓ ట్వీట్ సంధించారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం మొత్తం వెన్నుపోటు, దిగజారుడు, చిల్లర రాజకీయాలేనని ధ్వజమెత్తారు. తాను హిందూ-మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, దీన్ని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఉందని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే తాను దళితురాలిని కాదని, క్రైస్తవురాలిని అనడానికి తగిన ఆధారాలు చూపించగలరా? అని శ్రీదేవి సవాల్ విసిరారు.
వైఎస్ జగన్ ను చూసి నేర్చుకోండి..
తనపై చేసిన ఆరోపణ మీద నిలబడగలరా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తన హయాంలో పలు అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డారని, వాటిని వెలుగులోకి తీసుకొచ్చినందుకే ఆయన తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు.. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గుపడాలని సూచించారు. దళితుల్లో ఎవరు మాత్రం పుట్టాలని కోరుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దేశ చరిత్రలోనే ఏకంగా దళిత మహిళను హోం మంత్రిని చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. అలాంటి వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పారు.