ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక: భారీ వరద, తెరుచుకోని గేటు, ఆందోళన
Recommended Video
అమరావతి: ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఎటపాక, వీఆర్ పురం చింతూరు, కూనవరం మండలాల్లో 18 గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు.
కేరళ వరదలు: రూ.12వేల కోట్ల పేటీఎం అధినేత విరాళం రూ.10వేలు
ఏజెన్సీలోని భూపతిపాలెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తోంది. రంపచోడవరం - మారేడుమిల్లి మధ్య రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలు నాటు పడవలలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. విలీన మండలాలలో వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరదలతో కేరళ కకావికలం అయ్యిందని చంద్రబాబు అన్నారు. ఏపీలోను నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందును లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాణ నష్టం నివారించడంతో పాటు ఆస్తి నష్టం తగ్గించాలన్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అన్ని ప్రాంతాలలో లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుడంతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. ఆదివారం రాత్రి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పత్తి, వరి, జామాయిల్ తోటలు గోదావరి నీటిలో మునిగాయి. భద్రాచలం రామాలయం పడమర మెట్ల వద్దకు వర్షపు నీరు చేరి మోకాళ్ల లోతు వరకు ప్రవహిస్తోంది.
తెరుచుకోని గేటు, ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్ర కాల్వ రిజర్వాయర్కు వరద పోటెత్తింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 27,000 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు విడుదల చేశారు.
అయితే కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ రిజర్వాయర్ మూడో గేటు తెరుచుకోకపోవడంతో జలాశయం ఎడమ వైపు కరకట్ట బీటలు వారుతోంది. దీంతో దిగువ గ్రామాలైన లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.