సీఎం జగన్ కు బాలయ్య లేఖ- ఆ జిల్లా కావాలంటూ...
స్వతహాగా తన అభిమాని అయిన సీఎం జగన్ తో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఎక్కువగా మాట్లాడినట్లు, ఆయన గురించి స్పందించినట్లు ఎక్కడా కనిపించరు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాత్రమే పార్టీ తరఫున మాట్లాడే బాలయ్య .. సీఎం జగన్ ను నేరుగా విమర్శించడం అరుదుగా చూస్తుంటాం. అదే సమయంలో తన నియోజకవర్గం అభివృద్ధిపై అప్పుడప్పుడూ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాత్రమే బాలయ్య మాట్లాడుతుంటారు.
తాజాగా బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురానికి సంబంధించి సీఎం జగన్ ముందు మరో డిమాండ్ ఉంచారు. త్వరలో జరిగే జిల్లాల విభజనలో తన నియోజకవర్గం హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు.
హిందూపురాన్ని జిల్లాగా చేస్తే చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని ఆయన లేఖలో తెలిపారు. జగన్ తో పాటు సీఎస్ నీలం సాహ్నీకి కూడా ఆయన మరో లేఖ రాశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆమెకు గుర్తుచేశారు.