ఫంక్షన్ చేయాల్సిన టైమ్ లో టెన్షన్ పడుతున్న బాలయ్య..! అల్లుళ్ల విషయంలో అంతా అయోమయమే..!!
నందమూరి బాలకృష్ణ నిన్నటివరకు అందరికి టెన్షన్.. ఎప్పుడు ఎవర్ని కొడతారో.. ఎప్పుడు ఏ పదం సరిగా పలకలేక అభాసుపాలు అవుతామో అని పార్టీ నాయకులు తెగ టెన్షన్ పడేవారు. ఆ మధ్య తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ సారే జహాసే అచ్చా గేయం సరిగా పలకలేక నవ్వులపాలయ్యారు. ఆ ప్రసంగం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక తాజాగా ఆంధ్రాలో జరిగిన ఎన్నికలలో హిందూపురం నుంచి పోటీ చేసిన సందర్భంలో ప్రచారంలో కొందరు యువకుల్ని వెంట పడి కొట్టడం, ఫొటోలు దిగేందుకు వస్తే చేతులు ఆడించడం చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ నాయకులకు బాలయ్య వస్తున్నారంటే.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పట్టుకునేది.
లోకేష్, శ్రీభరత్ గెలుపుపై ఉత్కంఠ...! బాలయ్యకు అల్లుళ్ల టెన్షన్..!!
అందర్ని తన చేష్టలతో టెన్షన్ పెడుతున్న బాలయ్యకే ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైందట. హిందూపురంలో తన గెలుపుపై ధీమాతో ఉండగా.. తన అల్లుళ్ల గెలుపుపై టెన్షన్ పడుతున్నారు. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు ఒకేసారి.. అది కూడా తొలిసారిగా ఎన్నికల రంగంలో దిగారు. పెద్దల్లుడు, చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్ దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. సరిగా మాట్లాడటమే రాదని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు కామెంట్ చేసినా.. పాలనలో మాత్రం చురుకుగా వ్యవహరించి తన శాఖలకు న్యాయం చేశారన్న పేరు కూడా ఉంది.
సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్..! బయట ఉత్కంఠ పరిస్థితులు..!!
ఇటీవల సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో తన తండ్రి చంద్రబాబుతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించడంతో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు మంగళగిరిలో గెలుపు ఎలా ఉండబోతోందా.. అన్న టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు మంగళగిరిలో తెదేపా గెలుపు సాధ్యం కాలేదు. మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ విజయం సాధిస్తోంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్లతో తేడాతో గెలుపొందారు. ఆళ్లకు ఇక్కడ మంచి పేరుంది. సామాజిక సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేశారు. వైసీపీ సిటింగ్ స్థానంలో లోకేష్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో లోకేష్ విజయావకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ లోకేష్ గెలిస్తే ఇక నుంచి వరుసగా ఆయన మంగళగిరి నుంచే పోటీ చేసే అవకాశం ఏర్పడుతుంది.
ఇద్దరు అల్లుళ్లు రాజకీయాల్లోనే..! ఈ సారి భవితవ్యం ఎలా ఉంటుందో..!!
బాలకృష్ణ మరో అల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ చతుర్ముఖ పోరు నడిచింది. వైసీపీతోపాటు జనసేన నుంచి లక్ష్మీనారాయణ, బీజేపీ నుంచి పురందేశ్వరి పోటీ చేశారు. ఇది బీజేపీ సిటింగ్ స్థానం. దీంతో భరత్ విజయావకాశాలు ఎలా ఉంటాయోన్న ఆసక్తి అందరిలో నెలకొంది. బాలకృష్ణ కూడా ఒకటి రెండుసార్లు విశాఖ వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. ఆ తర్వాత బాలయ్య చిన్నకూతురు, శ్రీభరత్ భార్య తేజస్విని ఇక్కడే ఉండి ప్రచారం చేశారు.
ఎవరు గెలుస్తారు..! అసలు గెలుస్తారా అనేదానిపై నెలకొన్న ఉత్కంఠ..!!
వైసీపీ, బీజేపీ, జనసేన నుంచి గట్టి పోటీ ఎదురైంది. అలాగే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం పెద్ద ఎత్తున విశాఖలో నడుస్తోంది. దీంతో టీడీపీ ఓట్లు అసెంబ్లీతోపాటు లోక్సభకే పడ్డాయన్న గ్యారెంటి లేకుండా పోయింది. శ్రీభరత్ గెలుస్తాడా.. లేదా.. అని టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ లోకేష్ గెలిచి.. శ్రీభరత్ ఓడినా బాలకృష్ణకు నిరాశే మిగిలినట్లు అవుతుంది. మరి.. బాలయ్యకు ఇద్దరు అల్లుళ్లలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నది వేచి చూడాలి..!