హిందూపురం పంచాయతీ ఎన్నికల్లో బాలయ్యకు చేదు అనుభవం .. కుప్పం తరహాలోనే షాకిచ్చిన వైసీపీ
టిడిపి ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు సొంత నియోజకవర్గం హిందూపురంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హిందూపురంలో టిడిపి మద్దతుదారులు ఘోర పరాజయాన్ని చవి చూడగా, వైసీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగరవేశారు.
కోవిడ్ ఆస్పత్రికి భారీ విరాళం ఇచ్చిన బాలకృష్ణ .. హిందూపురం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బాలయ్య ఔదార్యం
హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 38 స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాలు గెలుచుకోగా, టిడిపి కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. దీంతో బాలయ్య కు హిందూపురం నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది.
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు కుప్పంలో ఎదురైన సీన్, హిందూపురంలో బాలకృష్ణ కు రిపీట్ అయింది. బాలకృష్ణ నియోజకవర్గంపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవటం ఒక కారణంగా చెప్తున్నారు.
ఇటీవల బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ, బాలకృష్ణను హిందూపురం నియోజకవర్గం ప్రజలు ఆదరించ లేదనే చెప్పాలి. ఇదే సమయంలో పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సొంత ఊరు రొద్దంలో కూడా టీడీపీకి ఓటమి ఎదురైంది . హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఝలక్ ఇచ్చారు. అంతేకాదు పెనుగొండ శాసనసభ నియోజకవర్గంలోని 80 స్థానాల్లో 71 స్థానాలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకోవడం టిడిపి నేతలను అంతర్మధనంలోనికి నెడుతున్నాయి.
ఇప్పటివరకు జరిగిన మొత్తం పంచాయతీ ఎన్నికలలో సంఖ్యాపరంగా అత్యధిక స్థానాలు వైసీపీ నే గెలుచుకొని పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటింది. ఈ పంచాయతీ ఎన్నికలలో వైసిపి తో బలంగా తలపడిన టిడిపి భయాందోళనలకు గురి చేసి, బెదిరించి వైసీపీ విజయం సాధించింది అంటూ ఆరోపిస్తోంది. ఏది ఏమైనా టీడీపీ కంచు కోటలలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ జెండా రెపరెపలాడింది.