బాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులు
ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటిగా మారింది . జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పట్టణంలోనే కేంద్రీకృతమైంది. ఇక్కడ వైరస్ తీవ్రత ఎలా ఉందో కేసుల సంఖ్యను బట్టే అర్థం చేసుకోవచ్చు.
దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్
అనంతపురం జిల్లా హిందూపురంలోనే కరోనా మొదటి కేసు నమోదైంది. జిల్లాలో ఇప్పుడు కేసుల సంఖ్య 113గా ఉంది. ముఖ్యంగా హిందూపురం, హిందూపురం రూరల్, లేపాక్షి ప్రాంతాల్లోనే 73పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో కరోనా మహమ్మారి హిందూ పురాన్ని వీడేలా కన్పించడంలేదు. పాజిటివ్ కేసుల కాంటాక్ట్తో సంబంధం లేకుండా హిందూపురంలో సామాజిక వ్యాప్తి జరుగుతోంది . రోజురోజుకు వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారి ఇక్కడే మకాం వేసి మరీ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. 27 మంది వైద్యులతో ప్రత్యేక మొబైల్ బృందాలు ఏర్పాటు చేసి కరోనా టెస్టింగ్ శాంపిళ్లు సేకరిస్తున్నారు.
ఇక కరోనా పాజిటివ్ ల కోసం పరీక్షలు చేసి పట్టణం అంతా జల్లెడ పడుతున్నారు. రెడ్జోన్లతోపాటు పట్టణంలో 60 ఏళ్లు దాటిన వారితో పాటు కరోనా లక్షణాలు ఉన్న వారందరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తూ ఇంటింటా సర్వే నిర్వ హిస్తున్నారు. ఇక అంతే కాదు హిందూ పురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కరోనా పాజిటివ్ కేసుల ఆసుపత్రిగా మార్చారు . హిందూపురంలో కొందరు మక్కాకు వెళ్లి రావడంతో జిల్లాలో తొలి సారిగా కేసులు నమోదయ్యాయి. మత ప్రచారంలో భాగంగా సుమారు వంద మంది గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది. ఆ తరువాత కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఇక ఇది ప్రస్తుతం హిందూపురం వాసులను టెన్షన్ పెడుతుంది. బాలయ్య నియోజకవర్గంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్న తరుణంలో అక్కడ లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.