లోకసభ ఎన్నికలు 2019 : హిందూపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో హిందూపురం ఒకటి. హిందూపురం అనంతపురం జిల్లాలో ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరుకు ఇది దగ్గరలో ఉంటుంది.హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు ముందు ఇది పెనుకొండ నియోజకవర్గంలో ఉండేది. ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి రాప్తాడు, మడకశిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
హిందూపూర్ లోక్ సభకు పార్టీ బలబలాలు చూస్తే... ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి ఐదుసార్లు, కెఎంపిపిలు ఒకసారి గెలుపొందాయి. ఇక్కడ నుంచి బయ్యపురెడ్డి మూడుసార్లు, ఎస్.గంగాధర్ మూడుసార్లు, నిమ్మల కిష్టప్ప రెండుసార్లు, కేవీ రామకృష్ణా రెడ్డి రెండుసార్లు గెలిచారు. కెఎస్.రాఘవాచారి, కె.రామచంద్రారెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, బి.కె.పార్ధసారథి, నిజాముద్దీన్ ఒక్కోసారి గెలుపొందారు.
2014 సాధారణ ఎన్నికలలో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టిడిపి సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్ప మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి డి.శ్రీధర్ రెడ్డిపై 97325 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 604291 ఓట్లు రాగా, శ్రీధర్ రెడ్డికి 506966 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జి.సి.వెంకట్రాయుడుకు 36452 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుచోట్ల టిడిపికి, ఒకచోట వైసిపికి అధిక్యత లభించింది. టిడిపికి రాప్తాడులో 8798, మడకశిరలో 20450, హిందూపూర్ లో 20272, పెనుకొండలో 22878, పుట్టపర్తిలో 7595, ధర్మవరంలో 18311 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసిపికి కదిరిలో 2433 ఓట్ల అధిక్యత మాత్రమే లభించింది.
ఇక ఈ ఐదేళ్లలో హిందూపురం అభివృద్ధి కోసం ప్రస్తుత ఎంపీ నిమ్మల కిష్టప్ప వెచ్చించిన ఖర్చును ఒకసారి చూద్దాం. ఐదేళ్లకు గాను ఎంపీ ల్యాడ్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రూ.25 కోట్లుకాగా అందులో నిమ్మల కిష్టప్ప హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఖర్చు చేసినది రూ. 17.88 కోట్లుగా జిల్లా అధికారులు వెల్లడించారు.
ఈ సారి హిందూపురంపై అన్ని పార్టీలు కన్నేశాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే హిందూపురం లోక్సభ స్థానంపై టీడీపీకి బాగా పట్టుందని చెప్పొచ్చు. ఈ సారి ఎలాగైనా ఆ స్థానాన్ని వైసీపీ దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ టీడీపీ పొత్తులో పోటీచేస్తుండటంతో హిందూపురంలో టీడీపీకే ఎక్కువగా గెలుపావకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత వస్తే తప్ప హిందుపురం లోక్సభ స్థానం ఎవరిదో చెప్పడం కష్టమంటున్నారు రాజకీయ నిపుణులు.