హిందూపురంలో బాలకృష్ణ! తండ్రి విగ్రహానికి పాలాభిషేకం! గెలిచిన తరువాత తొలిసారి!
అనంతపురం: ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురంలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.
ప్రధాన కూడలిలో నెలకొల్పిన ఎన్టీ రామారావు విగ్రహానికి బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి పాలాభిషేకం చేశారు. మూడు బిందెలతో పాలను పోసి, శుభ్రం చేశారు. పూల మాల వేసి నివాళి అర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం బాలకృష్ణ లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురంలల్లో పర్యటించారు. స్థానిక ప్రజలను కలుసుకున్నారు. హిందూపురం నుంచి బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో ఆరునెలల్లో రోడ్డు అందుబాటులోకి తెస్తామని అధికారులు ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, తనను ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. తన చివరి శ్వాస వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో హిందూపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.