పోలీసులకు చేతులెత్తి మొక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్ .. ఎందుకో తెలుసా
కరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న క్రమంలో చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారు . ఇక దీంతో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేశారు. ఇక పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండుతున్నాయి. వానకు తడుస్తున్నాయి. ఇక అవి నడపకుండా పక్కన పడెయ్యటంతో కదులుతాయా లేదా అన్న భయం ఇప్పుడు వాహన చోదకులకు పట్టుకుంది. ఇక ఈ క్రమంలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులకు చేతులెత్తి మొక్కి ఒక విజ్ఞప్తి చేశారు.
బాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులు
మీకు చేతులేత్తి మొక్కుతా, సీజ్ చేసిన ద్విచక్రవాహనాలను స్టేషన్లో ఎండ పెట్టకుండా వదిలేయండి అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానిక సిఐ లతో చేతులెత్తి నమస్కరించి మరీ అన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన పోలీసు అధికారులతో ఎంపీ ఈ విషయంపై మాట్లాడారు. వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా పోలీసులకు సూచించారు.
కరోనా కేసులు హిందూపురంలో బాగా నమోదు అయ్యాయి. దీంతో హిందూపురాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఇక్కడ లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేశారు . ఇక ఈ క్రమంలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు భారీ ఎత్తున వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్లలో ఉంచారు. ఇక ఆ వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి చెడిపోయే స్థితికి చేరుకున్నాయి.
దీనిపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయా వాహనదారులకు కోర్టు ద్వారా స్టేషన్ జరిమానాలు విధించి వదిలేయాలని కోరారు. ఎక్కువ రోజులు వాహనాలు ఉంచితే పాడవుతాయని ఎక్కువ రోజులు ఎండ పడితే పెట్రోల్ ఉన్న వాహనాల నుంచి మంటలు ఎగిసి అగ్నిప్రమాదం జరగొచ్చని ఆన్నారు. బెంగళూరు నగరంలో జరిగినట్లుగా ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక స్థానికంగా వాహనాలు సీజ్ అయిన వాహనదారుల కోసమే ఆయన చేతులెత్తి మరీ దణ్ణం పెట్టి పోలీసులకు విజ్ఞప్తి చేశారు .