హైదరాబాద్ లో 10 పబ్లు సీజ్ ... ఎన్ని సార్లు సీజ్ చేసినా అదే కల్చర్
హైదరాబాదులోని పబ్ కల్చర్ గబ్బు లేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. మద్యానికి, డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి పబ్బులకు వెళ్తున్నామని చెప్తున్న యువతను నిబంధనలు పాటించని పబ్ యాజమాన్యం ఆర్థిక వనరుగా మార్చుకుంటోంది. ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని పబ్ లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝుళిపించారు . ఉక్కుపాదం మోపారు.
పబ్బులపై ఆకస్మిక తనిఖీలు .. హైదరాబాద్ లోని 10 పబ్బులు సీజ్
హైదరాబాదులోని పలు పబ్ లపై ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు నియమ నిబంధనలను పాటించని పబ్ లను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న అన్ని పబ్ లపై దాడులు చేసిన అధికారులు, అగ్నిమాపక ఏర్పాట్లు, వ్యాపార అనుమతి లేని పది పబ్ లను సీజ్ చేశారు. అంతేకాదు గృహ సముదాయాల మధ్య లిక్కర్ బిజినెస్ చేయడానికి అనుమతి లేకున్నా చాలా పబ్బులు లిక్కర్ బిజినెస్ విచ్చలవిడిగా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఖైరతాబాద్ జోన్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మీడియాకు వెల్లడించారు. ఇక సీజ్ చేసిన వాటిలో లే వాంటేజ్ కేఫ్ బార్, ఫర్జి కేఫ్, జూరి కేఫ్ & బార్, అబ్సార్బ్ - జూబ్లీ హిల్స్లోని బోటిక్ బార్ మరియు టోట్ నైట్క్లబ్ మరియు బంజారా హిల్స్లోని జెహ్న్ ఆన్ 10 లు ఉన్నాయి.
మరో 26 పబ్ లకు నోటీసులు జారీ చేశామని చెప్పిన జీహెచ్ఎంసీ అధికారులు
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొత్తం 48 పబ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక వాటిల్లో కేవలం 12 మాత్రమే నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయని, మిగతా పబ్బులు నిబంధనలు పాటించడం లేదని ఆయన తెలిపారు. అందుకే ఆకస్మిక తనిఖీలు చేపట్టామని నిబంధనలు పాటించని మరో 26 పబ్ లకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. పబ్బుల యాజమాన్యం తమ వ్యవహార శైలి మార్చుకోకుంటే, నిబంధనలు పాటించకుంటే, దశలవారీగా వాటిని కూడా సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
ఎన్ని సార్లు సీజ్ చేసినా నిబంధనలు పాటించని పబ్బుల యాజమాన్యం
2 నెలల క్రితం కూడా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిహెచ్ఎంసి అధికారులు అప్పుడు 15 పబ్ లను సీజ్ చేశారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదని ,పార్కింగ్ సౌకర్యం లేదని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా జనావాసాల మధ్య ఇళ్లలోనే కొన్ని పబ్ లను నిర్వహిస్తున్నారని గుర్తించిన అధికారులు అప్పుడు కూడా పలు పబ్ లను సీజ్ చేశారు. అయినప్పటికీ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఇప్పటికీ పబ్ ల తీరు మారడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పబ్ ల నిర్వహణ కొనసాగుతూనే ఉంది. అధికారులు ఒక పక్కన సీజ్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది .