99 కన్నా ఎక్కువే.. 104 నాటౌట్... బల్దియాలో గులాబీ గుబాళింపే: మంత్రి తలసాని శ్రీనివాస్
గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ప్రజల ముందుకు వచ్చారు నేతలు. చేసిన, చేస్తోన్న పనుల గురించి చెబుతున్నారు. సిటీకి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మాత్రం ఈ సారి కూడా మేయర్ పీఠం తమేదనని విశ్వాసంతో ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంటామని ఆయన చెబుతున్నారు. ప్రజా సంక్షేమ పనులే తమను విజయతీరాలకు చేరుస్తాయని ధీమాతో ఉన్నారు. అంతేకాదు తమ పార్టీ ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
99 సీట్లలో విజయం..
2016లో జరిగిన బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లను గెలుచుకుంది. మంత్రి కేటీఆర్ 100 సీట్లు సాధిస్తామని ప్రచారం చేసినా.. ఒక డివిజన్ దూరంలో నిలిచిపోయింది. అప్పట్లో ఇదీ చర్చకు కూడా దారితీసింది. అయితే ఈ సారి సెంచరీ దాటుతామని తలసాని విశ్వాసంతో ఉన్నారు. 104 డివిజన్లు తప్పనిసరిగా గెలుస్తామని చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రచార అస్త్రాలు అని పేర్కొన్నారు. అంతేకాదు తాము నిత్యం ప్రజలతోనే ఉన్నామని.. ఎన్నికల కోసం ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు.
104 పక్కా..
అయితే దుబ్బాక వేరు, గ్రేటర్ వేరు అని చెప్పారు. స్థానిక పరిస్థితుల వల్లే దుబ్బాకలో ప్రతీకూల ఫలితం వచ్చిందని చెప్పారు. కానీ బల్దియాలో అలా ఉండదని.. గతంలో కన్నా తమ సీట్లు పెరుగుతాయని చెప్పారు. కనీసం 5 సీట్లు ఎక్కువ గెలుస్తామని.. 104కి తగ్గబోమని చెప్పారు. బల్దియాలో 150 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. మేయర్ పీఠం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు అనే సంగతి తెలిసిందే. కానీ బీజేపీ పుంజుకోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Recommended Video
ఎవరు పైచేయి సాధిస్తారో..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. అందుకోసమే షెడ్యూల్ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసింది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.