10 కిలోల బియ్యం ఉచితం.. ఈ నెలలో మాత్రం 15 కిలోలు: మంత్రి గంగుల
బీపీఎల్ కుటుంబాలు, పేదలకు ఈ నెల (ఆగస్ట్) నుంచి ఉచితంగా 10 కిలోల బియ్యం అందిస్తామని పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.తెల్ల రేషన్కార్డుదారులకు నవంబర్ వరకు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్కార్డులు పొందినవారికి కూడా ఆగస్టు నుంచే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్త కార్డుదారుల కోసం బియ్యం సేకరణ, కేటాయింపుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి జరగాల్సిన బియ్యం పంపిణీని 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
పాత కార్డుదారులకు గత నెల కేంద్రం కోటా ప్రకారం ఇవ్వాల్సిన 5 కేజీలను కలిపి ఆగస్టు నెలలో 15 కేజీలను పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ నెల నుంచి మళ్లీ యథావిధిగా 10 కేజీలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 3,09,083 కుటుంబాలకు రేషన్కార్డులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 90.50 తెల్లకార్డులు, 2.88 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఉచిత బియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.416.34 కోట్ల ఖర్చు పెరుగుతుందని మంత్రి గంగుల వివరించారు.
గత నెలలో కేంద్ర ప్రభుత్వమే 5 కిలోల బియ్యం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. దానిని ఆగస్టు నెలలో ఇస్తామని మంత్రి చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మాత్రం.. 10 కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తామని స్పష్టంచేశారు. దీంతో నిజమైన లబ్దిదారులకు మేలు జరుగుతుంది. ఒక్కొక్కరికీ 10 కిలోలు రావడంతో వారి నెల గడుస్తోంది. బియ్యానికి సంబంధించి కొంత నగదు మిగలనుంది. ఆ డబ్బును ఇతర అవసరాలకు వాడుకునే వెసులుబాటు కలగనుంది.