ఏపీ నుంచి 110 ఆర్టీసీ బస్సులు, రద్దీకి అనుగుణంగా పెంచుతామని వెల్లడి
ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రైవేట్ స్కూల్ బస్సులను తీసుకొని, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో సర్వీసులను నడుపుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే పలు సర్వీసులు నడుస్తోన్నాయి. అయితే ప్రయాణికుల రద్దీ మేరకు సరిపోవడం లేదు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ 150 సర్వీసులను నడపాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి 110 బస్సులు ఆంధ్రప్రదేశ్కు నడుస్తాయని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు పేర్కొన్నారు. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే బెంగళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 సర్వీసులను నడుస్తాయని ఆయన తెలిపారు. ఈ బస్సుల్లో ముందుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ బస్సులు కూడా సరిపోకుంటే మరిన్ని సర్వీసులను తిప్పుతామని ఆయన క్లారిటీ ఇచ్చారు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచుతామని స్పష్టంచేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పీఆర్సీ, ఐఆర్, తదితర 26 డిమాండ్లపై కార్మికుల నాయకులు బెట్టుచేశారు. లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టంచేశారు. కానీ అందుకు ప్రభుత్వం సుతారము అంగీకరించడంతో నిన్నటి నుంచి సమ్మె కొనసాగుతుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకొంటారనే సమాచారంతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.