తెలంగాణలో ఒక్కరోజే భారీగా కరోనా కేసుల నమోదు, నలుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో ఒక్కరోజే కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 117 కొత్త కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. మరో ఇద్దరు వలస కార్మికులు ఉన్నట్లు నిర్ధారించారు.
మిగితా 66 కేసుల్లో స్థానికులే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, గురువారం ఒక్కరోజే కరోనాతో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 67కు చేరింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను హెల్త్ బులిటెన్ లో వేర్వేరుగా చూపించారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకూ మొత్తం లోకల్ కరోనా కేసులు 1908గా పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో వలస కార్మికుల కేసులు మొత్తం 175, సౌదీ నుంచి వచ్చినవారు 143, విదేశాల నుంచి వచ్చినవారిలో 30 చొప్పున కేసులు ఉన్నట్లు వివరించారు. ఈ లెక్కన రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు కలుపుకుని 2256 అవుతోంది.
దేశంలోనూ కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 1,58,897 కరోనా కేసులు నమోదయ్యాయి. 86,445 యాక్టివ్ కేసులున్నాయి. 67,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4,540 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.