139 మంది రేప్ కేసు..?: పోలీసుల అదుపులో డాలర్ భాయ్, రహస్య ప్రాంతంలో విచారణ..?
139 మంది రేప్ కేసులో బాధితురాలు ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డాలర్ బాయ్ బెదిరించడం వల్లే ఫిర్యాదు చేశానని చెప్పడంతో.. కేసు టర్న్ తీసుకుంది. అయితే తనపై లైంగికదాడి జరిగిందని.. కానీ ఆ సంఖ్య తక్కువగా కావొచ్చని తెలిపింది. దీంతో డాలర్ భాయ్పై పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే డాలర్ భాయ్ని టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
139 మందిపై కేసు..
దిశతో 139 మందిపై అత్యాచారం కేసు పెట్టించడంలో డాలర్ భాయ్ ప్రమేయం ఉందని పోలీసులు కూడా చెబుతున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా.. డాలర్ భాయ్ మాట్లాడిన ఆడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని తన వద్ద ఉంచుకుని ఏదైనా డ్రామా ఆడాడా అని అనుమానిస్తున్నారు.
స్వచ్చంద సంస్థ కార్యాలయంలో సోదాలు
యువతి ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని గాడ్పవర్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు ఆదివారం సోదాలు జరిపారు. ఇందులో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని.. కార్యాలయాన్ని సీజ్ చేశారు. డాలర్ భాయ్కి సంబంధించిన వివరాలు మాత్రం లభించలేదు. ఈ పేరు గురించి స్పష్టమైన సమాచారం లేకపోయినా.. అతని పూర్తి పేరు రాజా శ్రీకర్రెడ్డి అని తెలుస్తోంది. ఇటీవల అతనిపై భార్య కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వీరిద్దరు కలిసి..
పంజాగుట్ట యువతి జీవితాన్ని మీసాల సుమన్, డాలర్ భాయ్ నాశనం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్ భాయ్ యువతిపై అఘాయిత్యానికి పాల్పడి, బ్లాక్మెయిల్ చేశాడన్నారు. పంజాగుట్ట యువతి కేసులో యాంకర్ ప్రదీప్ లేడని చెప్పారు. యువతిని డాలర్ భాయ్ బెదిరించి ప్రదీప్పై కేసు పెట్టించాడని పేర్కొన్నారు. పంజాగుట్ట యువతి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. యువతికి ప్రాణహాని ఉంది, భద్రత కల్పించాలన్నారు.
ఏం జరిగిందంటే...
9 ఏళ్లలో తనను వివిధ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారని వాపోయింది. వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా 5 వేల సార్లు అత్యాచారం చేశారని బోరున విలపించింది. లైంగికదాడి చేసిన 139 మంది పేర్లను తన ఫిర్యాదులో యువతి రాసింది. బాధితురాలి ఫిర్యాదుతో 42 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. అయితే చివరికీ డాలర్ భాయ్ బెదిరించాడని యువతి మీడియా ముందు వచ్చి చెప్పింది. దీంతో అతనిని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.