మద్యం మత్తులో తల్లి: పసిపాప కిడ్నాప్..సూరత్లో ప్రత్యక్షం
ఈ మధ్య కిడ్నాపర్లు ఎక్కువగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ అపహరణకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే తాజాగా హైదరాబాదులో కిడ్నాప్కు గురైన 15 నెలల చిన్నారి ఆచూకీని గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో కనుగొన్నారు పోలీసులు. 15 రోజుల క్రితం ఇద్దరు దంపతులు ఓ చిన్నారిని కిడ్నాప్ చేశారు .
మద్యంకు బానిసను చేసిన దంపతులు
రాజు తారాసింగ్ గుర్జార్, భార్య మాధవిలు ఈ చిన్నారిని అపహరించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి పాపను కాపాడగలిగారు. పోలీసుల కథనం ప్రకారం చిన్నారి తల్లి తుసంబత్ జ్యోతి బసంత్ సింగ్ మద్యంకు బానిస కావడం ఆమె పాపను సరిగ్గా చూసుకోకపోవడంతో అదే అదునుగా భావించిన గుర్జార్ మరియు మాధవిలు పాపను కిడ్నాప్ చేశారు. వీరిద్దరూ రాచకొండలో నివాసం ఉండేవారు. జ్యోతి వారి పొరిగింట్లో ఉండేది. ఇక గుర్జార్ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉండటంతో ఓ పాప కావాలని భావించినట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ ముగ్గురు కొడుకులు హైదరాబాదులోని ఓ హాస్టల్లో ఉంటున్నారు.
తల్లి మద్యం మత్తులో ఉండగా పాప కిడ్నాప్
గుర్జార్ టైల్స్ ఫిట్టర్గా సూరత్లో పనిచేసేవాడు. అయితే మంచి ఉద్యోగం కోసం సూరత్ను వీడి హైదరాబాదులోని బీబీనగర్కు కొన్నేళ్ల క్రితం వచ్చారు.తర్వాత రోడ్డుపక్కన బెలూన్లు అమ్ముకునే మాదవితో పరిచయమై ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన జ్యోతి బిడ్డను కిడ్నాప్ చేశారు. అయితే జ్యోతి నాలుగు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.గుర్జార్ మాధవి దంపతులు తనకు మద్యంను అలవాటు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన కూతురును కిడ్నాప్ చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే వీరు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు కపోదరా పోలీసుల సహాయం కోరారు తెలంగాణ పోలీసులు.
ట్విస్ట్ విచారణలో ట్విస్ట్
గుర్జార్ మాధవి దంపతులు సూరత్లోని శ్రీజినగర్లో పాత మిత్రులతో కలిసి ఉన్నారని గుజరాత్ పోలీసులు తెలిపారు వారిని పట్టుకుని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విచారణలో భాగంగా వారు మరో ట్విస్ట్ ఇచ్చారు. తల్లి జ్యోతి మద్యానికి బానిసై కూతురును సరిగ్గా చూసుకునేది కాదని , మద్యం మత్తులో పాపను కొట్టేదని చెప్పారు. దీంతో మాధవి చిన్నారి బాగోగులను చూసుకునేదని వెల్లడించారు. ఇలా రోజు జరుగుతుండటంతో పాపను కిడ్నాప్ చేసి సూరత్కు వచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్జార్ దంపతులు తెలిపారు.