15660 డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మంత్రి కేటీఆర్ ట్వీట్, వావ్ అని నెటిజన్ల రియాక్షన్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం కొనసాగుతోంది. పేదలకు ప్రభుత్వమే రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఈ స్కీంపై విమర్శలు వచ్చినా.. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. ఆ ఇళ్లు అపార్ట్ మెంట్ల తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఓకేచోట 15 వేల పై చిలుకు ఇళ్లను నిర్మించారు. దీనికి సంబంధించి ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
పేదలకు ఆవాసం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండు పడకగదుల ఇళ్లను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఇళ్లను అపార్ట్మెంట్లుగా నిర్మిస్తుండటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలో సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట 15,660 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించింది. వీటికి సంబంధించిన డ్రోన్ చిత్రాలను మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆ ఇళ్ల ఫోటోలు చాలా ముచ్చటగా కనిపించాయి.
Another beautiful sighting from the sky was the largest #DignityHousing 2BHK project at Kollur in Sangareddy district
— KTR (@KTRTRS) September 12, 2021
Has shaped up beautifully 15,660 units In a single location. Keen on getting this inaugurated by Hon’ble CM #KCR Garu at the earliest 😊#TrailblazerTelangana pic.twitter.com/bbEDSQ0eE6
ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో నిర్మించిన ఈ ఇళ్లను సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకే చోట పెద్ద సంఖ్యలో రెండు గదుల ఇళ్లు నిర్మించారు. ఆ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం, నిర్మాణాలను ఆనుకొనే వెళ్తున్న ఓఆర్ఆర్ దృశ్యాలను ఆకాశం నుంచి చూస్తుంటే అద్భుతంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లపై విపక్షాలు విమర్శించాయి. అనుకున్న స్థాయిలో నిర్మించడం లేదని ఆరోపించాయి. దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ధీటుగానే స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లు ఎలా ఉండేవో విమర్శించారు. ఇంటికి అల్లుడు వస్తే కాళ్లు బయటకు వచ్చేవని పేర్కొన్నారు. కానీ తాము నిర్మిస్తోన్న ఇళ్లు అలా ఉండవని స్పష్టంచేశారు. అనుకున్నట్టే ఇళ్లు బానే ఉన్నాయి.. కానీ నిర్మాణాలు మాత్రం మరింత ఆలస్యం అవుతున్నాయి. దీంతో విపక్షాలు విమర్శలకు మరింత పదును పెట్టాయి.