16 సీట్లు గెలవడం పక్కా : మంత్రి తలసాని ధీమా
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తీసుకొచ్చిందే చంద్రబాబు అని ఆరోపించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు చంద్రబాబు డబ్బులు పంపారని మండిపడ్డరాయన. శుక్రవారం ఎల్బీస్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారసభలో ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరుకావాల్సి ఉన్నప్పటికీ మిర్యాలగూడ నుంచి రావడం ఆలస్యం కావడంతో రాలేకపోయారని ప్రకటించారు తలసాని.
నిద్రలో కూడా కేసీఆర్ జపమే ..?
చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్ పేరును కలవరిస్తున్నారని చెప్పారు తలసాని. ఏపీ ఎన్నికల్లో ఏ అంశం లేక కేసీఆర్ను అస్త్రంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో అన్నిప్రాంతాల వారు సంతోషంగా ఉన్నారని, లేనిపోని అపోహలు సృష్టించొద్దని కోరారు.
గ్రేటర్ను పట్టించుకోలేదు
70 ఏళ్లకుపైగా దేశాన్ని ఏలినవి కాంగ్రెస్, బీజేపీలేనని స్పష్టంచేశారు తలసాని. ఎన్నికల వేళ ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ మత రాజకీయాలు శృతిమించాయని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను కాంగ్రెస్, బీజేపీ నేతలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
విశ్వనగరంగా భాగ్యనగరం
జంటనగరాల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారని తెలిపారు తలసాని. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిటీ పోలీసులకు దేశంలో మంచి పేరుందని .. ఫ్రెండ్లీ పోలీసులని పేర్కొన్నారాయన. హైదరాబాద్ నగరం మరో 15 కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.