ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబురాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!!
Recommended Video
హైదరాబాద్ : సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్నానికి కొత్త ఆశలు చిగురింప జేసింది. కలలోనైనా సాధ్యపడుతుందా అనుకున్న నాలుగున్నరకోట్ల ప్రజల మనోభీష్టాన్ని సాకారంచేసింది. ఈ చిన్న కరపత్రికే తర్వాతికాలంలో తెలంగాణద్రోహుల వెన్నుల్లో చలిపుట్టించింది పరాయి పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తెలంగాణ జాతి కోసం తెలంగాణ ఖ్యాతి కోసం మాత్రమే ఉదయించిన ఉద్యమపార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా అవతరించింది.
టీఆర్ఎస్ ఆవిర్బావం..! ఎగిసి పడ్డ ఉద్యమం..!!
ఉక్కు సంకల్పం లాంటి ఆ ఉద్యమం చరిత్రపుటల్లో శాశ్వత చోటు కల్పించుకుంది. అసాద్యమని అవహేళన చేసిన వారి పట్ల సింహస్వప్నంలా పరిణమించి, తెలంగాణ జాతికి స్వేచ్చా వాయువులను అందించింది. పిడికెడు మందితో మొదలైన ఆ ఉద్యమం ఆకాశమంత ఎగసిపడి., ప్రళయకాల రుద్రుడిలా గర్జించి శత్రువు గెండెల్లో గుణపం దింపింది. దీంతో తెలంగాణ కల సాకారమైంది.
ఎన్నో అవరోధాలు..! మరెన్నో అడ్డంకులు..!!
జనం జీర్ణించుకోలేక పోయినా, విధి వికటాట్టహాసం చేసినా, ప్రక్రుతి పగబట్టినా, పట్టు సడలకుండా ఉద్యమాన్ని ఉరకలెత్తించి అనుకున్నది సాధించిన ధీరోదాత్తుడుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పుడమిపై చెరగని ముద్రవేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఎంతో కీలమైన ఉద్యమంగా భావిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పొచ్చు.
పట్టు సడలని విక్రమార్కుడు..! ఈ కల్వకుంట్ల చంద్రశేఖరుడు..!!
ఎన్ని అవరోధాలెదురైనా, రాజకీయ పార్టీలు సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు స్రుష్టించినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీని ముందుకు నడిపించి అనుకున్న కల సాకారం చేసారు కల్వకుట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవించి 18సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులులేకుండా పోయింది. తలెంగాణ ఉద్యమానికి ఊపిరైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బవించి 18 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అద్యక్షుడు కల్వకుంట్ల తారాకరామారావు తెలంగాణ భవన్ లో పార్టా జెండాను ఆవిష్కరించారు.
కేటీఆర్ ట్వీట్..! స్పూర్తిదాయకమంటున్న పార్టీ శ్రేణులు..!!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన ట్విట్టర్లో పార్టీ కార్యకర్తలకు వ్యవస్థాపక దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. 2001, ఏప్రిల్ 27వ తేదీన ఓ వ్యక్తి ప్రారంభించిన సాహసోపేత పయణం ఇప్పుడు లెజండరీగా మారిందన్నారు. టీఆర్ఎస్ కోసం గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న లక్షలాది మంది నేతలకు, తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ 18వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ హిందీ కవితను కూడా ట్వీట్ చేశారు. మై అకేలా హీ చలాతా జానిబ్ ఏ మంజిల్ మగర్.. లోగ్ సాత్ ఆతే గయే ఔర్ కార్వా బన్తా గయా. ఈ కవిత అర్థం ఇదీ.. నేను ఒంటరిగానే గమ్యం వైపు పయనిస్తూ ఉన్నాను.. కానీ ప్రజలు నా వెంటే నడుస్తూ.. ప్రవాహంలా కలిసిపోయారని అభివర్ణించారు.