హైదరాబాద్లో యువతి ఆత్మహత్య.. 15వ అంతస్తు నుంచి దూకి.. లాక్ డౌనే కారణమా..?
హైదరాబాద్లోని మణికొండలో విషాదం చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికి వెళ్లలేకపోతున్నానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంట్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఈరవల్లిక(20) ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లోని మణికొండ ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్స్లో పనికి కుదిరింది. అప్పటినుంచి అక్కడే పనిచేస్తోంది. వారం రోజుల క్రితం ఆమె సోదరి నందిగామలో పాపకు జన్మనిచ్చింది. తల్లికి ఫోన్ చేసిన ఈరవల్లిక పాపను చూసేందుకు ఆత్రుత కనబర్చింది. హైదరాబాద్ నుంచి వస్తానని.. అక్క వాళ్ల పాపను చూస్తానని చెప్పింది. అయితే తల్లి మాత్రం లాక్ డౌన్ అయిపోయేవరకు అక్కడే ఉండాలని వారించింది.
ఇంటికి వెళ్లలేకపోతున్నానని మనస్తాపం చెందిన ఈరవల్లిక బుధవారం ఉదయం అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్ యాజమాన్యం రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.